Malkajgiri: బోడుప్పల్లో తాగునీటి తిప్పలు.. రంగంలోకి మాజీ మేయర్ అజయ్ యాదవ్!
Malkajgiri: బోడుప్పల్ సర్కిల్ పరిధిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జలమండలి ఈడీ పంకజను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కలిశారు.
Malkajgiri: బోడుప్పల్లో తాగునీటి తిప్పలు.. రంగంలోకి మాజీ మేయర్ అజయ్ యాదవ్!
బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ లో కొనసాగుతున్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) మల్కాజిగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలపై ఆయన విస్తృతంగా చర్చించారు. అనేక కాలనీల్లో తగిన వాటర్ ప్రెషర్ లేకపోవడంతో ఇండ్లకు మంచినీరు సరిగా చేరడం లేదని తెలిపారు. నాలుగు నుంచి ఐదు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, అందులో కూడా లో ప్రెషర్ కారణంగా చాలా ఇళ్లకు నీరు అందడం లేదని వివరించారు.
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కూడా కోరారు. ఈడీ పంకజను కలిసిన వారిలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బోమ్మక్ కళ్యాణ్ కుమార్, మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ళ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




