Hyderabad: రామంతపూర్లో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు
Hyderabad: హైదరాబాద్ రామంతపూర్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు. 3.495 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు నిందితుల అరెస్ట్.
Hyderabad: రామంతపూర్లో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు
Hyderabad: ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ ప్రాంతంలో రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిర్వహించిన దాడుల్లో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. రామంతాపూర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన రెండు ఆపరేషన్లలో మొత్తం 3.495 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అధికారుల వివరాల ప్రకారం, గోకుల్ నగర్కు చెందిన బుచ్చిళ్ల కౌశిక్ ఒడిశా నుంచి తక్కువ ధరలకు గంజాయిని తెప్పించి స్థానికంగా విక్రయాలు చేస్తున్నాడనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ ఏ టీమ్ సీఐ బాలరాజు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన దాడిలో కౌశిక్ ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 2.46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇక మరో దాడిలో రామంతపూర్ ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న నామెళ్లి వెల్థి ప్రవీణ్ వద్ద 1.035 కిలోల గంజాయి పట్టుబడింది. అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.ఈ రెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులను ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. కేసులు నమోదు చేసిన ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు గంజాయిని సీజ్ చేసి, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అక్రమంగా నిషేధిత గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని ఎక్సైజ్ అధికారులు ప్రజలకు సూచించారు.




