Uppal: ఉప్పల్‌లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్: బ్రెడ్, బిస్కెట్ యూనిట్లకు నోటీసులు!

Uppal: ఉప్పల్‌లోని సిద్ధివినాయక ఫుడ్స్, గోల్డెన్ ఫుడ్స్ తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి తీవ్ర అపరిశుభ్రతపై నోటీసులు జారీ చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 7 July 2026 10:43 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్: బ్రెడ్, బిస్కెట్ యూనిట్లకు నోటీసులు!

ఉప్పల్: ఉప్పల్ పరిధిలోని రెండు ఆహార తయారీ యూనిట్లలో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో తీవ్ర పరిశుభ్రత లోపాలు, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో సంబంధిత యాజమాన్యాలకు ఇంప్రూవ్‌మెంట్ (మెరుగుదల) నోటీసులు జారీ చేయాలని అధికారులు సిఫార్సు చేశారు.

ముందుగా సిద్ధివినాయక ఫుడ్స్ (బ్రెడ్ తయారీ యూనిట్)లో నిర్వహించిన తనిఖీల్లో ఆహార పదార్థాలను నేరుగా నేలపై నిల్వ ఉంచడం, కార్మికులు అప్రాన్‌లు, గ్లౌజ్‌లు ధరించకుండా ఆహార పదార్థాలను తయారు చేయడం, బ్రెడ్ తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియలు అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహించడం గుర్తించారు.

నిల్వ ర్యాక్‌లు తుప్పు పట్టి దుమ్ముతో కప్పుకుపోవడం, గోడలపై సాలెగూళ్లు ఉండడం, తగినంత వెలుతురు, గాలి ప్రసరణ లేకపోవడం, యూనిట్‌లో ఇంటి ఈగలు సంచరిస్తుండడం వంటి లోపాలను అధికారులు నమోదు చేశారు.

ఈ యూనిట్‌కు 100కు 53 హైజీన్ స్కోర్ మాత్రమే లభించింది. అనంతరం గోల్డెన్ ఫుడ్స్ (ఉస్మానియా బిస్కెట్ల తయారీ యూనిట్)లో తనిఖీలు చేపట్టగా అక్కడ కూడా ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపించాయి. తయారీ కేంద్రంలో తగినంత లైటింగ్ లేకపోవడం, కీటకాలు లోపలికి రాకుండా ఇన్‌సెక్ట్-ప్రూఫ్ మెష్‌లు ఏర్పాటు చేయకపోవడం, ఇంటి ఈగలు అధికంగా కనిపించడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులు నిర్వహించకపోవడం, కార్మికులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ముడి పదార్థాలను శాస్త్రీయంగా నిల్వ చేయకపోవడం, తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియలు అపరిశుభ్రంగా సాగడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.

ఈ యూనిట్‌కు 100కు 58 హైజీన్ స్కోర్ నమోదైంది. ఆహార తయారీ సంస్థలు పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, గుర్తించిన లోపాలను నిర్ణీత గడువులోగా సరిదిద్దాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story