Hyderabad: పర్యావరణ పరిరక్షణలో దేవాలయాలు ఆదర్శం - అజ్మీరా స్వామి
Hyderabad: హయత్నగర్ సర్కిల్లో దేవాలయాలకు స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ. ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని డిప్యూటీ కమిషనర్ అజ్మీరా స్వామి పిలుపు.
Hyderabad: పర్యావరణ పరిరక్షణలో దేవాలయాలు ఆదర్శం - అజ్మీరా స్వామి
హైదరాబాద్: ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడటంలో దేవాలయాలు ముందుండాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ అజ్మీరా స్వామి పిలుపునిచ్చారు. “మంచి సమాజ నిర్మాణానికి దేవాలయాలు మార్గదర్శక కేంద్రాలుగా మారాలి” అని స్పష్టం చేశారు.
జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణహిత వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బి.ఎన్.రెడ్డినగర్లోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం, పద్మావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ప్రశాంతినగర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కమిటీలకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు, మొక్కలను ఉచితంగా అందజేశారు.
ఒక్కో దేవాలయానికి 98 స్టీల్ ప్లేట్లు, 98 స్టీల్ గ్లాసులు, 45 జ్యూట్ బ్యాగులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఒక్కో దేవాలయానికి సుమారు రూ.20 వేల విలువైన వస్తువులను అందించారు.
ఈ సందర్భంగా అజ్మీరా స్వామి, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్కు బదులుగా స్టీల్, జ్యూట్ వంటి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.
పాడైన దేవుళ్ల చిత్రపటాలను రోడ్లపై, చెత్తకుప్పల్లో పడేయొద్దు.. వాటిని గౌరవప్రదంగా తొలగించేందుకు ఎంఎంసీ ఆధ్వర్యంలో ‘ఉద్వాసన’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అజ్మీరా స్వామి తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఇప్పుడే మార్పు మొదలుపెట్టాలి. పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్ తరాలను కాపాడగలం అని ఆయన అన్నారు.
దేవాలయ ప్రతినిధులు మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజ సేవకు కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారాన్ని భక్తుల్లో విస్తృతంగా చేపడతామని తెలిపారు.
కార్యక్రమంలో దేవాలయ ప్రతినిధులు బూడిది వివేకానంద రెడ్డి, సి. మంగపతి రావు, ఎం. రాజిరెడ్డి, చంద్రశేఖర్, కుమారస్వామి, నారాయణ, రామకృష్ణ, రవీందర్, రమేష్, సాంబశివరావు, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాథ్, యాదా రామలింగేశ్వరరావు, ఇ. శ్రీరాములు గౌడ్, ఎ. సత్యనారాయణ, రఘునాథ్ యాదవ్, గాయకులు కె.వి. రమణయ్య, తాతయ్య, అల్లూరయ్య శెట్టి, ఓబులేష్ యాదవ్, భ్రమరాంబ, రఘురాములు, నాగమణి, రవీందర్, పూజారులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.




