Hyderabad: పెరిగిన వేతనాలు అమలు చేయాలి NHM ఉద్యోగుల ఆందోళన
Hyderabad: హైదరాబాద్ కోఠి DH ఆఫీస్ ముందు NHM ఉద్యోగుల నిరసన. GO 1195 ప్రకారం పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఆగస్టు 15 డెడ్లైన్.
Hyderabad: పెరిగిన వేతనాలు అమలు చేయాలి NHM ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ముందు తెలంగాణ వైద్య, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
జీవో నంబర్ 1195 విడుదలై ఏడాది గడిచినా అమలు చేయకపోవడంపై... ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా వేతనాలు పెరగని ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాల పెంపును ప్రకటించినప్పటికీ... జీవో విడుదలై సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగులు ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.
తాము అధికార పార్టీ కార్మిక అనుబంధ సంఘానికి చెందిన వారమే అయినప్పటికీ... ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చూపడంతో... తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆగస్టు 15లోపు పెరిగిన వేతనాలను అమలు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం ప్రకారం నోటీసు ఇచ్చి... దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




