Hyderabad: లుంబినీ పార్కులో పర్యాటక శాఖ బోట్ల డ్రైవర్లకు "సిపిఆర్" శిక్షణ

Hyderabad: టూరిజం ఎండీ గౌతమి ఆధ్వర్యంలో బోట్ల డ్రైవర్లకు జీవీఆర్ ఈఎంఆర్ఐ డాక్టర్లు గుండెపోటు వస్తే ప్రాణాలు కాపాడే సిపిఆర్ (CPR) విధానంపై శిక్షణ ఇచ్చారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 30 July 2026 7:55 PM IST
Hyderabad
X

Hyderabad: లుంబినీ పార్కులో పర్యాటక శాఖ బోట్ల డ్రైవర్లకు "సిపిఆర్" శిక్షణ

హైదరాబాద్: టూరిజంశాఖలోని బోట్ల డ్రైవర్లకు సీపీఆర్ పై శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ లోని లుంబీనిపార్కులో బోటింగ్ కార్యాలయంలో గురువారం జీవీఆర్ ఈఎంఆర్ఐ డాక్టర్లు సీపీఆర్ పై అవగాహన కల్పించారు.

హార్ట్‌స్ట్రోక్‌కు గురైతే చాలామందికి అది గుండెపోటు అన్న విషయం కూడా తెలియదు.. స్పృహ తప్పి పడిపోయారనుకుంటారు.. లేదా ఫిట్స్‌ అనుకొని చేతిలో తాళాలు పెడుతుంటారు.. అలా ఒక్కసారిగా కుప్పకూలితే ముందుగా నాడి కొట్టుకుంటుందో లేదా చూడాలి. పల్స్‌ లేకపోతే అది స్ట్రోక్‌గా భావించాలి.. అలాగే శ్వాస తీసుకుంటున్నారో లేదో చూడాలి.. ఛాతీపై చెవి పెట్టి గుండె కొట్టుకుంటోందో? లేదో? చూడాలి.. వీటిలో ఏది లేకపోయినా వెంటనే సీపీఆర్‌ చేయాలని డాక్టర్లు సూచించారు.

ఛాతీపై ఒక చేతిపై మరో చేయి వేసి.. రెండు చేతులతో గట్టిగా నొక్కుతూ ఉండాలని, నిమిషానికి కనీసం 30 సార్లు అలా చేయాలని, అలా స్పృహలోకి వచ్చేంతవరకు నొక్కుతూ ఉండాలన్నారు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లాలని, ఇలా చేయడం వల్ల బ్లడ్‌ సర్క్యులేషన్‌ తిరిగి మొదలవుతుందని డాక్టర్లు వివరించారు.

ఎక్కువ సేపు బ్లడ్‌ సర్క్యులేషన్‌ జరగకపోతే శరీరంలోని కణాలు చనిపోతాయని, ముఖ్యంగా మెదడు, కిడ్నీల్లో ఉండే కణాలు ఆక్సిజన్‌ అందక చనిపోతాయని, దీంతో ఒక్కోసారి మనిషి బతికినా బ్రెయిన్‌డెడ్‌ అయ్యే అవకాశాలుంటాయని వివరించారు.

సీపీఆర్‌ కారణంగా గుండెపోటు వచ్చిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చని తెలిపారు. టూరిజం ఎండీ గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోటింగ్ డీజీఎం మహేష్ కుమార్, బోట్ల డ్రైవర్లు, టూరిజం సిబ్బంది పాల్గొన్నారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad

Next Story