LB Nagar: ఎల్బీనగర్: యాంటీబయాటిక్స్ వాడకంపై అవగాహన సదస్సు!
LB Nagar: ఎల్బీనగర్ డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అవసరం లేకుండా వాడితే ముప్పు అని హెచ్చరించారు.
LB Nagar: ఎల్బీనగర్: యాంటీబయాటిక్స్ వాడకంపై అవగాహన సదస్సు!
LB Nagar: యాంటీబయాటిక్స్ను అవసరం లేకుండా వినియోగించడం ప్రమాదకరమని డాక్టర్ కేర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి హెచ్చరించారు. వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదని ప్రజలకు సూచించారు. యాంటీబయాటిక్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎల్బీనగర్ బ్రాంచ్ డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ కేర్ గ్రూప్ డైరెక్టర్ గౌరీశంకర్, డాక్టర్ అమరావతి తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయి?
గత 20 ఏళ్లుగా నాలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న అనుభవంతో సమాజంలో వ్యాధుల పెరుగుదలపై తమ బృందం 60 రోజుల పాటు పరిశోధన చేసినట్లు డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. సుమారు 46 గ్రామాలను సందర్శించి ప్రజల జీవన విధానం, ఆరోగ్య సమస్యలపై వివరాలు సేకరించినట్లు చెప్పారు.
వైద్యులు, మందులు, వైద్య సదుపాయాలు పెరుగుతున్నా వ్యాధులు మాత్రం ఎందుకు పెరుగుతున్నాయనే అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
చిన్న జబ్బుకే యాంటీబయాటిక్స్ వద్దు
జలుబు, మోషన్స్ వంటి చిన్నపాటి సమస్యలకు వెంటనే మందులు వేసుకోవడం సరికాదని సూచించారు. కొన్ని సందర్భాల్లో శరీరానికి తగిన సమయం ఇస్తే సహజంగానే కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి అనారోగ్యానికి యాంటీబయాటిక్స్ అవసరం లేదని స్పష్టం చేశారు.
“యాంటీబయాటిక్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. అవసరమైనప్పుడు మాత్రమే వైద్యుల సలహాతో వాడాలి” అని అన్నారు.
100 రోజుల పాటు అవగాహన
యాంటీబయాటిక్ వినియోగం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు 100 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. సోషల్ యాక్టివిటీస్, ప్రజా కార్యక్రమాలు, వివిధ వేదికల ద్వారా అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అవసరం లేని మందులకు దూరంగా ఉండి.. వైద్యుల సూచనల మేరకే యాంటీబయాటిక్స్ వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




