Madugula: గణేష్ మండపాలను సందర్శించిన ఏసీపీ రాజు - డీజేలపై నిషేధం
Madugula: మాడ్గులలో గణేష్ మండపాలను తనిఖీ చేసిన ఏసీపీ కేపీవీ రాజు. ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని, డీజేలకు అనుమతి లేదని హెచ్చరిక.
Madugula: గణేష్ మండపాలను సందర్శించిన ఏసీపీ రాజు - డీజేలపై నిషేధం
మాడుగుల: మాడుగుల మండలం గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీ కె.పి.వి. రాజు సూచించారు. బుధవారం మాడ్గుల మండల పరిధిలోని పలు గణేష్ మండపాలను మాడ్గుల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ టి. వేణుగోపాల్, అడ్మిన్ ఎస్ఐ శ్రీ హెచ్. రాఘవేందర్లతో కలిసి ఏసీపీ సందర్శించారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులతో మాట్లాడిన ఏసీపీ.. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, జనసందోహాన్ని నియంత్రించడంతో పాటు అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్కు అనుమతి లేదని ఏసీపీ స్పష్టం చేశారు. ఇతరులను రెచ్చగొట్టేలా, కించపరిచేలా నినాదాలు, వ్యాఖ్యలు చేయకుండా నిర్వాహకులు, భక్తులు సంయమనం పాటించాలని సూచించారు.
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహిస్తూ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. పోలీసుల సూచనలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




