Malkajgiri: 22ఏ జాబితా చేర్పులపై సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టిన ఎంపీ ఈటల రాజేందర్

Malkajgiri: మల్కాజిగిరి నివాస ప్రాంతాలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 Aug 2026 7:30 PM IST
Malkajgiri
X

Malkajgiri: 22ఏ జాబితా చేర్పులపై సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టిన ఎంపీ ఈటల రాజేందర్

మల్కాజిగిరి: 22ఏ నిషేధిత జాబితాలో నివాస ప్రాంతాలను చేర్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. నేరేడ్‌మెట్ డివిజన్ ఆర్కేపురంలో 22ఏ బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మల్కాజిగిరి మినీ ఇండియాగా మారిందని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ఆర్కేపురం కాలనీ ఏర్పడి 61 సంవత్సరాలు పూర్తయిందని, దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను ఇప్పుడు 22ఏ జాబితాలో చేర్చడం సరికాదన్నారు. ప్రభుత్వం ఒకవైపు ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇస్తామని చెబుతూ, మరోవైపు సొంతంగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి హక్కులు లేకుండా చేస్తోందని ప్రశ్నించారు.

హైడ్రా ఏర్పాటైన సమయంలోనే తాను దానిని వ్యతిరేకించానని, పేదల ఇళ్లను కూల్చే విధానం సరికాదని స్పష్టం చేశారు. గాజులరామారంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చడంతో పాటు వారు ఏర్పాటు చేసుకున్న బోర్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడం దారుణమన్నారు. పేదలపై మాత్రమే అధికార ప్రతాపం చూపడం ఎందుకని ప్రశ్నించారు.

పెద్దల భూముల జోలికి వెళ్లకుండా పేదల గుడిసెలను తొలగించడం అన్యాయమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసిన వారు, భూములు విక్రయించిన మధ్యవర్తులు, అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మూసీ ప్రక్షాళన విషయంలోనూ తాను గతంలో పోరాటం చేశానని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. విద్యార్థి దశ నుంచే మూసీ పరివాహక ప్రాంత సమస్యలపై పోరాడుతున్నానని, 48 గంటల పాటు అక్కడే ఉండి కూల్చివేతలను అడ్డుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు.

22ఏ వంటి భారీ నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడం లేదని, అయితే పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉండకూడదని సూచించారు. పేదల ఇళ్లకు, భూములకు రక్షణ కల్పించి 22ఏ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story