Hyderabad: ఎడారిలా మారిన మన్సూరాబాద్ పెద్ద చెరువు
Hyderabad: హైదరాబాద్లో భానుడి ప్రతాపానికి ఎల్బీనగర్లోని మన్సూరాబాద్ పెద్ద చెరువు పూర్తిగా ఎండిపోయింది.
Hyderabad: ఎడారిలా మారిన మన్సూరాబాద్ పెద్ద చెరువు
హైదరాబాద్: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. నగరంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్లోని చాలా చెరువులు చుక్క నీరు లేక నెర్రెలుబారాయి. నెల కిందటి వరకు కళకళలాడిన చెరువుల్లో నీరు ఆవిరై నేల నెర్రెలిచ్చింది. కొన్ని చెరువులు యువకులకు క్రికెట్ మైదానాలుగా మారాయి.
ఎల్బీనగర్లోని మన్సూరాబాద్ పెద్ద చెరువు పరిస్థితి దారుణంగా మారింది. నీరు పూర్తిగా ఇంకిపోయి చెరువు కాస్తా ఎడారిని తలపిస్తోంది. నీరు లేక పక్షులు అల్లాడుతున్నాయి. చేపలు, తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రతి ఏడాది వేసవిలో చెరువులు ఎండిపోవడం సర్వసాధారణమైనా ఈసారి ఏప్రిల్లోనే భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండడంతో పరిస్థితి మరింత దిగజారింది. భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పునర్ వైభవం ఎప్పుడు?
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువులకు పునర్ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం చెప్పింది. కూకట్పల్లిలోని బతుకమ్మ కుంట*ను హైడ్రా అధికారులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే దారిలో *ఉప్పల్ నల్లచెరువు సుందరీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి.
అయితే ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు చెరువులు కబ్జాలకు గురై అంధకారంలో ఉన్నాయి. మన్సూరాబాద్ పెద్ద చెరువు*కు కూడా పునర్ వైభవం తీసుకురావాలని, చెరువులోకి మళ్లించిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని స్థానికులు కోరుతున్నారు. హైడ్రా దృష్టి సారించి చెరువును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




