Qutubullapur: పాలిక్లినిక్ ఏర్పాట్లను పరిశీలించిన డీఎంహెచ్వో డా.ఆనంద్
Qutubullapur: కుత్బుల్లాపూర్ షాపూర్నగర్ యూపీహెచ్సీని డీఎంహెచ్ఓ డా. ఆనంద్ సందర్శించారు. వైద్య సేవలపై సమీక్షించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
Qutubullapur: పాలిక్లినిక్ ఏర్పాట్లను పరిశీలించిన డీఎంహెచ్వో డా.ఆనంద్
Qutubullapur: పట్టణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను వారి సమీపంలోనే అందించాలనే ఉద్దేశంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను దశలవారీగా పాలిక్లినిక్లుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. కె. ఆనంద్ షాపూర్నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించారు.
ఈ సందర్భంగా పాలిక్లినిక్ ఏర్పాట్ల పురోగతిని, అందుబాటులోకి రానున్న ప్రత్యేక వైద్య సేవలను, ప్రజలకు సేవలు అందించే విధానాన్ని పరిశీలించారు. పాలిక్లినిక్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను వారంలో నిర్ణీత రోజుల్లో ఔట్పేషెంట్ సేవల రూపంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని డా. ఆనంద్ తెలిపారు.
ఆయా ప్రాంతాల జనాభా, భౌగోళిక పరిస్థితులు, వైద్య సేవల అవసరాలను పరిగణనలోకి తీసుకుని పాలిక్లినిక్లను గుర్తించడం, ప్రత్యేక వైద్య సేవల రకాలు, సేవల సమయాలు, వారానికి ఎన్ని రోజులు సేవలు అందించాలి, అవసరమైన సందర్భాల్లో ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫరల్ విధానం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
అలాగే శాపూర్నగర్ UPHCలో పెండింగ్లో ఉన్న సివిల్ రిపేర్స్, రీనోవేషన్ మరియు చిన్నపాటి మరమ్మతు పనుల స్థితిని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, అన్ని విభాగాలు సక్రమంగా పనిచేసేలా, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాలిక్లినిక్ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర కార్యాలయం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పాలిక్లినిక్కు సంబంధించిన యూనిఫామ్ బ్రాండింగ్, కలర్ కోడింగ్ పూర్తిగా అమలు చేయాలని సూచించారు.అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్ను సమకూర్చడంతో పాటు వాటి సరఫరా, ఏర్పాటు, వినియోగానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాలని తెలిపారు.
అనంతరం UPHCలో టీబీ కార్యక్రమం అమలును కూడా డా. ఆనంద్ సమీక్షించారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు అందించాల్సిన నిక్షయ్ పోషన్ యోజన , డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ( ఆర్థిక సహాయం ) సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందుకోసం అర్హులైన టీబీ రోగుల చెల్లుబాటయ్యే బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ వివరాల సేకరణ, ధృవీకరణ మరియు జిల్లా కార్యాలయానికి సమర్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వివరాల లోపాల కారణంగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం ఆలస్యం కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అదేవిధంగా ఎచ్ఇవి కేసుల నిర్వహణపై కూడా సమీక్ష నిర్వహించి, సంబంధిత రోగులకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందేలా చూడాలని తెలిపారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన గర్భిణీ కేసును స్వయంగా పరిశీలించి, అందుతున్న వైద్య సేవలు, రోగి పరిస్థితి మరియు అవసరమైన వైద్య సహాయంపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసి, అవసరమైన ప్రత్యేక వైద్య సేవలను కూడా సమీపంలోనే అందించేందుకు పాలిక్లినిక్ల అభివృద్ధి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డా. కె. ఆనంద్ అధికారులకు సూచించారు.




