Medipally: మేడిపల్లి పీర్జాదిగూడ నీటి కష్టాలపై జలమండలికి వినతి
Medipally: పీర్జాదిగూడ డివిజన్లలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నేత తుంగతుర్తి రవి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
Medipally: మేడిపల్లి పీర్జాదిగూడ నీటి కష్టాలపై జలమండలికి వినతి
మేడిపల్లి: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధి మేడిపల్లి డివిజన్, పీర్జాదిగూడ డివిజన్ లలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ ల అధ్యక్షుడు తుంగతుర్తి రవి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఉప్పల్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉన్న రెండు భారీ నీటి రిజర్వాయర్ ట్యాంక్ లలో ఒకటి మాత్రమే వినియోగంలో ఉండటంతో పెరిగిన జనాభాకు సరిపడా మంచినీటి సరఫరా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న రెండో రిజర్వాయర్ ట్యాంక్ ను కూడా తక్షణమే అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పాత మంచినీటి పైప్లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిలో తుప్పు, పాచి పేరుకుపోవడం వల్ల కలుషిత నీరు సరఫరా అవుతోందని తెలిపారు. తరచూ లీకేజీలు ఏర్పడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని పేర్కొంటూ పాత పైప్ లైన్ల స్థానంలో నూతన పైప్లైన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక ధరణి కాలనీ, సాయిప్రియ నగర్, సత్యనారాయణపురం, లక్ష్మీనగర్, ఐఐసీటీ ప్రాంతాల్లో ఇప్పటికీ హెచ్ఎండబ్ల్యూఎస్ మంచినీటి పైప్లైన్లు లేవని తెలిపారు. ఆయా కాలనీల్లో కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ కల్పించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని తుంగతుర్తి రవి విజ్ఞప్తి చేశారు.




