Medipally: మేడిపల్లిలో గణేష్ సురక్ష సంకల్ప్-2026 అవగాహన సదస్సు!
Medipally: మేడిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో వివేకానందనగర్లో 'గణేష్ సురక్ష సంకల్ప్-2026' రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం.. పాల్గొన్న ఇన్స్పెక్టర్ జలేందర్రెడ్డి.
Medipally: మేడిపల్లిలో గణేష్ సురక్ష సంకల్ప్-2026 అవగాహన సదస్సు!
Medipally: గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా మేడిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ వివేకానందనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడిపల్లి ఇన్స్పెక్టర్ జలేందర్రెడ్డి, ఎస్ఐలు నర్సింగరావు, శ్రీను, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవీందర్తో పాటు ట్రాఫిక్, మేడిపల్లి పోలీసు సిబ్బంది, షీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక సహచరులు సుల్తానా, రాధ, వాణి కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు వాహనదారులు, పాదచారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని ఇన్స్పెక్టర్ జలేందర్రెడ్డి తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో సీటుబెల్ట్ వినియోగించాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించకూడదని హెచ్చరించారు.
పాదచారులు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో సుమారు వంద మంది కాలనీ వాసులు పాల్గొనగా, స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది.




