Malkajgiri: రుతుక్రమంపై అపోహలు వీడాలి: ప్రిన్సిపల్ ఆచార్య బండి రాజు!
Malkajgiri: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్యంపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మెన్స్ట్రువల్ కప్పుల వినియోగంపై అవగాహన కల్పించారు.
Malkajgiri: రుతుక్రమంపై అపోహలు వీడాలి: ప్రిన్సిపల్ ఆచార్య బండి రాజు!
మల్కాజ్గిరి: రుతుక్రమంపై విద్యార్థినులు అపోహలు వీడి, ఆరోగ్యం–పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజిగిరి ప్రిన్సిపల్ ఆచార్య బండి రాజు సూచించారు. మంగళవారం కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, అంజనీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రుతుక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి రాజు మాట్లాడుతూ రుతుక్రమం మహిళల సహజ శారీరక ప్రక్రియ అని, దీనిపై బహిరంగంగా చర్చించేందుకు విద్యార్థినులు సంకోచించాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. విద్యార్థినులు ఆరోగ్యంపై అవగాహనతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో అంజనీ ఫౌండేషన్ చీఫ్ కో-ఆర్డినేటర్ భవాని కొమరశెట్టి వక్తగా పాల్గొని రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, అపోహల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రుతుక్రమ కప్పుల వినియోగం, ప్రయోజనాలు, పరిశుభ్రత పాటించే విధానాలను వివరించారు.వీటి వినియోగం పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని తెలిపారు.
‘కప్ ఆఫ్ కాన్ఫిడెన్స్–ఫ్లో ఫార్వర్డ్: ఫ్రమ్ సైలెన్స్ టు స్ట్రెంగ్త్’ అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు,మహిళా అధ్యాపకులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు నిర్వాహకులు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమాన్ని కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ డా. స్వాతి నిర్వహించారు.




