Ameerpet: జాతీయ స్థాయి పోటీల ఖర్చులన్నీ నావేనన్న సనత్ నగర్ ఎమ్మెల్యే!
Ameerpet: తలసాని ట్రస్ట్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 70 జిమ్స్ కు రెజ్లింగ్ మ్యాట్లు పంపిణీ చేసి, జాతీయ క్రీడాకారులకు జీవితకాల రవాణా భరోసా ఇచ్చారు.
Ameerpet: జాతీయ స్థాయి పోటీల ఖర్చులన్నీ నావేనన్న సనత్ నగర్ ఎమ్మెల్యే!
అమీర్పేట్: రెజ్లర్ లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం అమీర్ పేట లోని మున్సిపల్ స్టేడియంలో తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని 70 వ్యాయామశాలల నిర్వాహకులకు రెజ్లింగ్ మ్యాట్ లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెజ్లింగ్ ను కుస్తీ పోటీలు గా, రామాయణ, మహాభారతం కాలంలో మల్లయుద్దం గా పిలుచుకునే వారని పేర్కొన్నారు. 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కుస్తీ పోటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్ధికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, కుస్తీపై ఉన్న అభిమానం తో అనేకమంది వారసత్వం గా పోటీలకు శిక్షణ పొందుతున్నారని అన్నారు.
ప్రతి సంవత్సరం 150 మంది రెజ్లర్లు వివిధ కెటగిరీలలో జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని, వారికి అవసరమైన ట్రాక్, షూస్, రవాణా ఖర్చులను తన జీవితకాలం పాటు అందిస్తానని ప్రకటించారు. వ్యాయామశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన కొంత ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రెజ్లర్లు మట్టిలో కుస్తీ పోటీల ప్రాక్టీస్ చేస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని వారికి సౌకర్యవంతంగా ఉండేలా 70 వ్యాయామశాలలకు ఒక్కో వ్యాయామశాల కు 10 చొప్పున మ్యాట్ లను అందజేసినట్లు చెప్పారు.
వ్యాయామశాలల అభివృద్ధి, రెజ్లర్ లకు చేయూత అందించేలా భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ధాతలను ఆయన సన్మానించారు.




