Uppal: ఉప్పల్ రింగ్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై ఎంఎంసీ కమిషనర్ సంయుక్త పరిశీలన
Uppal: ఉప్పల్ రింగ్రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Uppal: ఉప్పల్ రింగ్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై ఎంఎంసీ కమిషనర్ సంయుక్త పరిశీలన
ఉప్పల్: ఉప్పల్ రింగ్ రోడ్డులో కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సంయుక్త తనిఖీలో ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, మున్సిపల్ చీఫ్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఉప్పల్, ఎల్బీ నగర్ ట్రాఫిక్ డీసీపీలు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు, వాహనాల రద్దీ, డైవర్షన్ ఏర్పాట్లపై కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట్ల స్పష్టమైన ట్రాఫిక్ డైవర్షన్ సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పీక్ అవర్స్ సమయంలో ట్రాఫిక్ నిలిచిపోకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం పెంచాలని సూచించారు.
అలాగే ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఉప్పల్ ప్రాంతంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కీలకమని కమిషనర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉప్పల్ రింగ్రోడ్పై ట్రాఫిక్ ప్రవాహం మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. నగర మౌలిక వసతుల అభివృద్ధిని వేగంగా పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.




