Hyderabad: కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే OU విద్యార్థుల డిమాండ్
Hyderabad: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.
Hyderabad: కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే OU విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పూర్తిగా కేంద్రం ప్రభుత్వం వైఫల్యం అని, నీట్ పేపర్ లికేజీ సంఘటన బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ నీట్ పేపర్ లికేజీ సంఘటన బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.
పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందన్నారు. లీకేజీ వెనక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శికించాలన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి, ఏఐఓబిసిఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మధు యాదవ్, జెవిఎస్ విద్యార్థి సంఘం అధ్యక్షులు చేరాల వంశీ, ఓయూ ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు ఆవుల శ్రీధర్, సురేందర్, ఏంబిసి ఫోరమ్ అధ్యక్షులు అశ్వన్, ఓయూ విద్యార్థి నాయకులు ప్రభాకర్, భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.




