Hyderabad: పంచాయతీరాజ్, అటవీ శాఖలపై పవన్ పర్యవేక్షణ
Hyderabad: భుజం శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు.
Hyderabad: పంచాయతీరాజ్, అటవీ శాఖలపై పవన్ పర్యవేక్షణ
Hyderabad: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ పాలనాపరమైన అంశాలపై నిరంతరం దృష్టి సారిస్తున్నారు. తనకు కేటాయించిన శాఖల పనితీరు, అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్లో పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, గ్రామాల్లో ప్రజలకు అందుతున్న సేవలపై ప్రధానంగా చర్చించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, మురుగు కాలువల శుభ్రత, చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి వనరుల నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.
అలాగే అటవీ శాఖకు సంబంధించిన అంశాలపై కూడా వివరాలు తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు.
శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్నప్పటికీ శాఖలపై ఉప ముఖ్యమంత్రి చూపిస్తున్న శ్రద్ధ, పరిపాలనా పర్యవేక్షణ కొనసాగించడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పంచాయతీరాజ్, అటవీ శాఖలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు కొనసాగిస్తున్నారు.




