Vikarabad: టెక్నాలజీతో ఐదేళ్ల లాంగ్ పెండింగ్ కేసు ఛేదించిన పోలీస్!
Vikarabad: వికారాబాద్ జిల్లాలో 'ఆపరేషన్ ముస్కాన్-XII' ప్రారంభమైన మొదటి రోజే పోలీసులు ఐదేళ్ల నాటి మిస్సింగ్ కేసును ఛేదించారు.
Vikarabad: టెక్నాలజీతో ఐదేళ్ల లాంగ్ పెండింగ్ కేసు ఛేదించిన పోలీస్!
వికారాబాద్: బాలల సంరక్షణ, హక్కుల రక్షణే ధ్యేయంగా జూలై 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా "ఆపరేషన్ ముస్కాన్–XII" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ తెలిపారు.
ఈ ఆపరేషన్ ప్రారంభం రోజే వికారాబాద్ పోలీసులు పట్టుదలతో శ్రమించి, సరిహద్దులు దాటి మరీ ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఒక క్లిష్టమైన 'మహిళ మరియు బాలుడి మిస్సింగ్' కేసును ఛేదించి ముస్కాన్ కార్యక్రమానికి అత్యుత్తమ ఆరంభాన్ని ఇచ్చారు.
గత 2020 సంవత్సరంలో నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ, చిన్నారి బాలుడు అదృశ్యమయ్యారు.
ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో ఇది "లాంగ్ పెండింగ్" కేసుగా మిగిలిపోయింది. ఇటీవల ఎస్పీ గారి ఆదేశాలతో నవాబ్పేట్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక ఆధారాలను (కాల్ డేటా, ఆధార్ లింక్లు) క్షుణ్ణంగా విశ్లేషించారు.
లభించిన ఆధారాలతో వికారాబాద్ డిఎస్పి అంజయ్య పర్యవేక్షణలో మోమిన్పేట్ సిఐ, జి. వెంకట్, నవాబ్పేట్ ఎస్ఐ గిరి ల యొక్క సూచనల మేరకు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఆంధ్రప్రదేశ్లోని మునగపాక పోలీస్ స్టేషన్ పరిధికి చేరుకుని, సుదీర్ఘ గాలింపు చర్యల అనంతరం ఆ మహిళను, బాలుడిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
టెక్నాలజీని వాడుకుని చాకచక్యంగా ఈ కేసును ఛేదించిన మోమిన్పేట్ సిఐ జి. వెంకట్, నవాబ్పేట్ ఎస్ఐ గిరి, సిబ్బంది సాయి కుమార్, మహేందర్ గౌడ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇట్టి సంధార్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
"మహిళలు, పిల్లల భద్రత విషయంలో వికారాబాద్ పోలీస్ శాఖ ఎప్పుడూ రాజీ పడదు.
ఈ రోజు నుండి ప్రారంభమైన 'ఆపరేషన్ ముస్కాన్-XII' లో భాగంగా తప్పిపోయిన, భిక్షాటన చేస్తున్న మరియు బాల కార్మికులుగా మారిన పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించడమే మా ప్రాధాన్యత. దీనికోసం సబ్ డివిజన్ల వారీగా పోలీస్ అధికారులు మరియు సంబంధిత అధికారులతో కలసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.
అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి వికారాబాద్ జిల్లాను “బాల కార్మిక రహిత” జిల్లాగా మార్చాలి" అని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ పిలుపునిచ్చారు.




