Raidurgam Land All Time Record : రాయదుర్గం భూముల వేలంలో సరికొత్త రికార్డు.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.!
Raidurgam Land All Time Record : తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చరిత్రలోనే
Raidurgam Land
Raidurgam Land All Time Record : తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండల పరిధిలోని రాయదుర్గంలో ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు నిర్వహించిన ఈ-వేలంలో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇక్కడ కేవలం ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 237 కోట్లు పలకడం విశేషం. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి గరిష్టంగా రూ. 177 కోట్లు పలకగా, ఈ ఏడాది ఆ రికార్డులను తిరగరాస్తూ ధరలు మరింత పైకి కదిలాయి.
రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న మొత్తం 6 ఎకరాల 29 గుంటల భూమిని విక్రయించడానికి టీజీఐఐసీ ఈ-వేలం ప్రక్రియను చేపట్టింది. ఈ వేలంలో ప్రముఖ నిర్మాణ సంస్థ 'గౌర వెంచర్స్' (Gaurav Ventures) అత్యధిక ధరను కోట్ చేసి ఈ ఖరీదైన భూమిని దక్కించుకుంది. ఎకరానికి రూ. 237 కోట్ల చొప్పున మొత్తం 6 ఎకరాల 9 గుంటల విస్తీర్ణానికి గానూ ఈ సంస్థ ఏకంగా రూ. 1490.73 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి ఈ ల్యాండ్ను సొంతం చేసుకుంది. గతంలో ఇక్కడి భూమిని ఎకరం రూ. 177 కోట్లకు 'ఎంఎస్ఎన్ రియాల్టీ' దక్కించుకోగా, ఇప్పుడు ఆ రేటును గౌర వెంచర్స్ దాటేసింది.
హైదరాబాద్ ఐటీ హబ్లో భూములకు ఉన్న విపరీతమైన డిమాండ్ను ఈ వేలం మరోసారి నిరూపించింది. రాయదుర్గం ప్రాంతం కమర్షియల్, ఐటీ స్పేస్కు కేంద్ర బిందువుగా మారడంతో ఇక్కడి స్థలాల కోసం దిగ్గజ సంస్థలు భారీగా పోటీ పడుతున్నాయి. ఈ విజయవంతమైన వేలం ఇచ్చిన ఉత్సాహంతో టీజీఐఐసీ తదుపరి విడత అమ్మకాలకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే రాబోయే జూన్ 1వ తేదీన ఇదే ప్రాంతంలో ఉన్న మరో 5.09 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.




