Vikarabad: బాధితులకు తక్షణ భరోసానే మా లక్ష్యం: ప్రజావాణిలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
Vikarabad: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజావాణి నిర్వహించారు. బాధితుల సమస్యలను నేరుగా విని, సంబంధిత ఎస్.హెచ్.ఓలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వికారాబాద్: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, బాధితులకు తక్షణ భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో "ప్రజావాణి" కార్యక్రమం ఈ రోజు నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ స్వయంగా ఫిర్యాదుదారులను కలిసి, వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ ఫిర్యాదుల కోసం ఎప్పుడైనా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.
నేటి ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి పలు ఫిర్యాదులు అందడం జరిగింది. వీటిపై తక్షణమే స్పందించిన ఎస్పీ , సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు (S.H.O) ఫోన్ ద్వారా సంప్రదించి, ఫిర్యాదుల గురించి ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా, పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు బలహీన వర్గాల ఫిర్యాదుల పట్ల అత్యంత మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని కంప్యూటరైజ్ చేస్తున్నామని, తద్వారా ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితులు అవసరం అనుకుంటే నేరుగా తనను కలవవచ్చని తెలిపారు.




