Hyderabad: తెలంగాణలో ఎన్‌ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి!

Hyderabad: తెలంగాణలో ప్రత్యేక ఎన్‌ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.

S MAHENDER, PALAKURTHI
Published on: 18 Sept 2026 1:32 PM IST
Hyderabad
X

Hyderabad: తెలంగాణలో ఎన్‌ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి!

Hyderabad: హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస తెలంగాణవాసుల (NRI) హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక తెలంగాణ NRI కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శ్రీ అద్దంకి దయాకర్ గారితో కలసి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శ్రీ అద్దంకి దయాకర్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాస భారతీయుల తరఫున ఈ కీలక ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో లక్షలాది మంది తెలంగాణవాసులు నివసిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు, సాంకేతికత, విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల ద్వారా విశేషంగా తోడ్పడుతున్నారని తెలిపారు. అయితే ప్రవాస తెలంగాణవాసులు మరియు వారి కుటుంబాలు ఆస్తి వివాదాలు, భూ సమస్యలు, న్యాయ సహాయం, అత్యవసర పరిస్థితులు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా తెలంగాణలో ప్రత్యేక NRI కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వినతిపత్రంలో కోరారు. ఈ కమిషన్ ద్వారా ప్రవాస తెలంగాణవాసుల కోసం ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, పెట్టుబడులకు సింగిల్ విండో విధానం, ఆస్తి రక్షణ, విదేశాల్లో అత్యవసర సమన్వయం, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ NRIలతో ప్రభుత్వ అనుసంధానం వంటి సేవలు అందించవచ్చని వివరించారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదనను పరిశీలిస్తామని, ప్రవాస తెలంగాణవాసుల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుందని పేర్కొన్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా ఈ వినతిపత్రం ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI