Uppal: బక్రీద్ వేళ శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక ఫోకస్
Uppal: బక్రీద్ పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా మేడిపల్లిలో ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది.
Uppal: బక్రీద్ వేళ శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక ఫోకస్
Uppal: బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో, సామరస్య వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం మేడిపల్లిలోని ఎం.కే.బి.ఆర్ ఫంక్షన్ హాల్ లో మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్, చర్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధి ప్రజలు, మత పెద్దలు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ వెంకట రమణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు పరస్పర గౌరవ భావంతో, సోదరభావంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఆదేశించారు.
ఏదైనా అనుమానాస్పద ఘటనలు లేదా సమస్యలు తలెత్తిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరిస్తూ, ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్, చర్లపల్లి పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, కమిటీ పెద్దలు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.




