Uppal: ఉప్పల్లో మహిళా సంఘాలకు పార్కుల నిర్వహణ బాధ్యతలు
Uppal: మహిళా సాధికారతకు అండగా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Uppal: ఉప్పల్లో మహిళా సంఘాలకు పార్కుల నిర్వహణ బాధ్యతలు
Uppal: మహిళా సాధికారతకు మరింత ఊతమిస్తూ, ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ఉప్పల్ జోన్ యూబీడీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ జోన్ పరిధిలోని రెండు పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలు) అప్పగించింది. ఉప్పల్ సర్కిల్లోని చిలకనగర్ వార్డులో ఉన్న బ్యాంక్ కాలనీ పార్క్, నాచారం సర్కిల్ పరిధిలోని శక్తి సాయి నగర్ వార్డులో ఉన్న గోకుల్ నగర్ పార్కులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు.
పార్కుల నిర్వహణ, సంరక్షణకు సంబంధించి మహిళా సంఘాల సభ్యులకు ముందస్తు శిక్షణ కూడా అందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా పార్కుల నిర్వహణకు సంబంధించిన వర్క్ ఆర్డర్ పత్రాలను మల్లాపూర్ స్లమ్ లెవల్ ఫెడరేషన్-1, బీరప్పగడ్డ స్లమ్ లెవల్ ఫెడరేషన్ మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా రాధికా గుప్తా మాట్లాడుతూ, మహిళా సంఘాలు పార్కులను పరిశుభ్రంగా, సమర్థవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే మరిన్ని మహిళా సంఘాలు ముందుకు వచ్చి జోన్లోని ఇతర పార్కుల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించాలని కోరారు. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు పచ్చదనం పరిరక్షణలో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాధిక గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో యూబీడీ డిప్యూటీ డైరెక్టర్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్, యూబీడీ మేనేజర్, పీఓ యూసీడీతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.




