Vikarabad: సమస్యలు పరిష్కరించకుంటే కారణాలు చెప్పాల్సిందే అదనపు కలెక్టర్
Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో 120 అర్జీలు అందాయి. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజావాణికి సార్థకత.
Vikarabad: సమస్యలు పరిష్కరించకుంటే కారణాలు చెప్పాల్సిందే అదనపు కలెక్టర్
Vikarabad: ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజావాణికీ సార్థకత ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వెంకటాచారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజవాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కె.వెంకటాచారి, ఇంచార్జి డీఆర్ఓ రాజేశ్వర్, జడ్పీ సీఈవో సుధీర్ జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కె.వెంకటాచారి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీ తనంతో అధికారులు పనిచేయాలనే ఉద్దేశ్యంతో డివిజన్ స్థాయిలో ప్రజావాణిని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
జిల్లాలో తాండూర్, వికారాబాద్ లలో నిర్వహించే ప్రజావాణిలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రతివారం సమీక్ష చేపడతామని ఆయన తెలిపారు. ప్రతి శాఖకు వచ్చిన అర్జీలను పరిష్కరించాలని తెలిపారు. పరిష్కరించని పక్షంలో దానికి గల ఖచ్చితమైన కారణాలను తెలియజేయాలని ఆయన అధికారులకు సూచించారు.
సమస్యల పరిష్కారం పట్ల అధికారులు పారదర్శకంగా పని చేయాలన్నారు. రెవెన్యూ కు సంబ దించిన సమస్యలను పరిష్కరించేందుకు మండల తహసీలదార్లు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. భూమి సర్వేకు వచ్చిన దరఖాస్తులపై సత్వరమే స్పందించి పరిష్కార దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలకు సంబంధించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారికి సూచించారు. ప్రజావాణిలో ( 120) దరఖాస్తులు రాగా రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లపై అధికంగా ఫిర్యాదులు అందాయి.
ప్రజావాణిలో డీఆర్డీఏ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, డీఎస్సీడిఓ జైపాల్ రెడ్డి, డిబిసిడిఓ మాధవ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




