Bakrid 2026 : డొనాల్డ్ ట్రంప్కు బంగ్లాదేశ్ గేదెకు ఉన్న లింక్ ఏంటి?.. దాన్ని హోంమంత్రి ఎందుకు కాపాడాడు ?
Bakrid 2026 : బంగ్లాదేశ్లో డొనాల్డ్ ట్రంప్ పోలికలున్న గేదెను బక్రీద్ బలి నుండి చివరి నిమిషంలో ప్రభుత్వం రక్షించింది. అమెరికా ఆగ్రహానికి భయపడి హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump Buffalo
Bakrid 2026 : బంగ్లాదేశ్లో బక్రీద్ పండుగ వేళ ఒక వింత ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టిన ఒక భారీ గేదెను బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరుణంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో జోక్యం చేసుకుని ఆ బలిని నిలిపివేసింది. సుమారు 700 కిలోల బరువున్న ఈ విలక్షణమైన గేదెను పండుగ కోసం కొనుగోలు చేసినప్పటికీ, దేశ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో స్థానిక పోలీసులు ఆ జంతువును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వింత నిర్ణయం వెనుక అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాటు ఒక ఆసక్తికరమైన రాజకీయ కథ కూడా దాగి ఉంది.
ట్రంప్ పోలికలతో సోషల్ మీడియాలో వైరల్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణగంజ్లో పెరిగిన ఈ నాలుగేళ్ల గేదె గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీని కళ్లు, తలపై ఉండే జుట్టు చూడటానికి సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. ఈ విచిత్ర పోలికల కారణంగా దీనికి ట్రంప్ అని పేరు పెట్టగా, ఆ గేదె ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు, పలువురు జంతు ప్రేమికులు ఈ గేదెను బలి ఇవ్వకూడదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు.
బ్రిటన్ చరిత్రకారుడి ఎంట్రీ..
సోషల్ మీడియాలో ఈ గేదె ఫోటోలు చూసిన బ్రిటన్కు చెందిన ప్రముఖ మత వ్యవహారాల చరిత్రకారుడు హెలెన్ ఇన్గ్రామ్ ఈ వివాదంలోకి ప్రవేశించారు. ట్రంప్ పోలికలున్న గేదెను బలి ఇస్తే ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ జంతువు ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఈ గేదెను బలి ఇవ్వవద్దంటూ అంతర్జాతీయ సమాజం నుండి బంగ్లాదేశ్పై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగిపోయింది.
సొంత డబ్బులతో కొనేసిన హోంమంత్రి
ఈ వివాదం మరింత ముదరకముందే బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బీబీసీ బంగ్లా కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ నుంచి నేరుగా స్థానిక పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేరానిగంజ్కు చెందిన కొత్త యజమాని మోనిరుజ్జమాన్ నుంచి ఆ గేదెను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ చౌదరి స్వయంగా విలేకరులతో మాట్లాడుతూ.. తానే ఆ గేదెను సొంతంగా కొనుగోలు చేశానని ప్రకటించారు. ఇది చాలా అరుదైన జంతువని, దీనిని బలి ఇవ్వకుండా ఒక జూ పార్క్లో ఉంచి సంరక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిని ఎంత ధరకు కొన్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
అమెరికా అలకకు భయపడిన కొత్త ప్రభుత్వం
ఈ గేదెను బలి ఇస్తే సమాజంలో అనవసరమైన విద్వేషాలు వ్యాపించే ప్రమాదం ఉందని హోంమంత్రి పైకి చెబుతున్నప్పటికీ, దీని వెనుక అసలు భయం అమెరికానే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి అమెరికా వైఖరే ప్రధాన కారణమనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం ఏ చిన్న విషయంలోనూ అమెరికా ఆగ్రహానికి గురికావాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఈ గేదె బలి వార్త డొనాల్డ్ ట్రంప్ వరకు వెళ్తే, ఆయన ఎక్కడ సీరియస్ అవుతారో, తమ దేశంపై ఎలాంటి ఆంక్షలు విధిస్తారోననే ముందస్తు భయంతోనే హోం మంత్రిత్వ శాఖ ఇంతలా దిగివచ్చిందని సమాచారం.
బంగ్లాదేశ్లో తగ్గుతున్న పశువుల బలులు
మరోవైపు, గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో బక్రీద్ పండుగ సందర్భంగా ఇచ్చే పశువుల కుర్బానీల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. 2023లో బక్రీద్ సందర్భంగా దాదాపు 1 లక్షా 42 వేల పశువులను బలి ఇవ్వగా, 2025 నాటికి ఆ సంఖ్య భారీగా క్షీణించి కేవలం 92 వేలకు పరిమితమైంది. దేశంలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, పశువుల రేట్లు ఆకాశాన్ని తాకడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక బలి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.




