బోస్టన్‌లో ఘనంగా భారత స్వాతంత్య్రం వేడుకలు.. ఆగస్టు 9న పరేడ్

బోస్టన్‌లో ఆగస్టు 9న భారత స్వాతంత్య్రం వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలతో భారత్-అమెరికా స్నేహాన్ని చాటనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Aug 2026 2:30 AM IST
Boston to Host Grand Indian Independence Day Parade
X

Boston to Host Grand Indian Independence Day Parade

అమెరికాలోని బోస్టన్ ప్రాంతంలో భారతీయ-అమెరికన్ సమాజం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. భారత స్వాతంత్ర్య వేడుకలతో పాటు భారత్-అమెరికా స్నేహబంధాన్ని చాటిచెప్పేలా భారీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్-అమెరికన్స్ న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో ఆగస్టు 9న బోస్టన్‌లో 5వ అంతర్జాతీయ ఇండియా డే పరేడ్ జరగనుంది. న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో భారత్ స్వాతంత్ర్యం, భారతీయ సంస్కృతి, భారత్-అమెరికా స్నేహాన్ని ఘనంగా చాటిచెప్పే అతిపెద్ద వేడుకల్లో ఇది ఒకటిగా నిలవనుంది.

భారత్ 80వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది వేడుకలను ‘స్వేచ్ఛా ఉత్సవం - భారత్-అమెరికా స్నేహం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. పరేడ్‌లో 15 శకటాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

వివిధ భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సంస్థలు, మాజీ సైనికులు, అత్యవసర సేవల సిబ్బంది, న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలోని భారతీయ-అమెరికన్ సమాజానికి చెందిన వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారతీయ సమాజంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఈ వేడుక ప్రతిబింబించనుంది.

ఈ వేడుకకు మాజీ సైనిక అధికారి, యుద్ధ సేవా పతక గ్రహీత కల్నల్ ఇందర్ ప్రీత్ సింగ్, అమెరికా నౌకాదళ ఇంటెలిజెన్స్ నిపుణురాలు మ్యాగీ లెహ్‌మన్ గ్రాండ్ మార్షల్స్‌గా వ్యవహరించనున్నారు. దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా వారిని సత్కరించనున్నారు.

బోస్టన్‌లో భారత తొలి కాన్సుల్ జనరల్ రఘురామ్ శాస్త్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో, న్యూ ఇంగ్లాండ్‌లో పెరుగుతున్న భారతీయ-అమెరికన్ సమాజానికి మద్దతు ఇవ్వడంలో ఈ వేడుక కీలక మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ ఏడాది పరేడ్ ఇప్పటివరకు జరిగిన వాటిలోనే అతిపెద్దది, అత్యంత వైభవంగా ఉండనుందని ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్-అమెరికన్స్ న్యూ ఇంగ్లాండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ రాథోర్ తెలిపారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సాంస్కృతిక వైవిధ్యం, భారత్-అమెరికా బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేడుకలో చాటిచెప్పనున్నట్లు పేర్కొన్నారు.

మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీకి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 15, 2026ను వరుసగా ఐదో ఏడాది మసాచుసెట్స్‌లో ‘ఇండియా డే’గా పాటించేందుకు ఆమె ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ-అమెరికన్ సమాజం అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ ఈ సంప్రదాయం కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు.

జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ నృత్య, సంగీత బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, కమ్యూనిటీ, లాభాపేక్షలేని సంస్థల ప్రదర్శనలు, విక్రయ కేంద్రాలు, వివిధ రకాల సంప్రదాయ భారతీయ వంటకాలతో ‘ఇండియన్ క్యూజీన్ ఫెస్టివల్’ కూడా నిర్వహించనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story