China Vs Taiwan: చైనా గగనతలం మూసివేత.. యుద్ధానికి సిద్ధం అవుతోందా?

China Vs Taiwan: చైనా తన గగనతలాన్ని 40 రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తైవాన్ పై యుద్ధం కోసమే ఈ చర్య అని భావిస్తున్నారు

KVD Varma
Published on: 7 April 2026 8:34 AM IST
China Vs Taiwan: చైనా తన గగనతలాన్ని 40 రోజులపాటు మూసివేస్తున్నట్టు  ప్రకటించడం
X

China Vs Taiwan

China Vs Taiwan: ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధ భయంతో వణికిపోతోంది. ఒక పక్క మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మరోవైపు ఆసియాలో యుద్ధమేఘాలు కమ్ముకువస్తున్న సూచనలు కనిఇస్తున్నాయి. ఇప్పుడు చైనా తీసుకున్న ఒక చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ నిపుణులను ఉలిక్కిపడేలా చేసింది. చైనా ఎటువంటి నిర్దిష్ట కారణం చెప్పకుండా, సముద్రంపై ఉన్న తన గగనతలంలోని చాలా భాగాన్ని వరుసగా 40 రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

రెండు మూడు రోజులు కాదు.. ఏకంగా 40 రోజులు..

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం, చైనా సాధారణంగా ఎప్పుడైనా ఒక్కోసారి సైనిక విన్యాసాల కోసం తన గగనతలాన్ని 1 నుండి 3 రోజుల పాటు మూసివేస్తుంది. కానీ ఈసారి మార్చి 27 నుండి మే 6 వరకు సుదీర్ఘ కాలాన్ని ఖరారు చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు తెర లేపింది. చైనా ఏదైనా ప్రధాన క్షిపణి సాంకేతికతను పరీక్షిస్తోందని లేదా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తైవాన్‌పై దాడి చేయడానికి చివరి నిమిషంలో సన్నాహాలు చేస్తోందని ఈ చర్య సూచిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

తైవాన్ సరిహద్దులోకి చైనా యుద్ధనౌకలు..

మరోవైపు తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) దిగ్భ్రాంతికరమైన వివరాలను విడుదల చేశారు. దీంతో ఈ అనుమానం మరింత బలపడింది. సోమవారం ఉదయం, చైనాకు చెందిన:

  • 3 యుద్ధ విమానాలు
  • 6 నావికాదళ యుద్ధనౌకలు
  • 2 ప్రభుత్వ నౌకలు సముద్ర మధ్య రేఖను దాటి తైవాన్ ఉత్తర, తూర్పు వాయు రక్షణ మండలాల్లోకి (ADIZ) ప్రవేశించాయి. ఈ కారణంగా తైవాన్ సైన్యాన్ని అత్యంత అప్రమత్తం చేశారు.

చైనా లక్ష్యం 2027..?

తైవాన్ తమలో అంతర్భాగమని చైనా ఎల్లప్పుడూ వాదిస్తూ వస్తోంది. అయితే, తైవాన్‌కు దాని స్వంత ప్రత్యేక ప్రభుత్వం, సైన్యం, ప్రజాస్వామ్యం ఉన్నాయి. 2027 నాటికి ఏ విధంగానైనా తైవాన్‌ను ఆక్రమించుకోవాలనే లక్ష్యాన్ని చైనా నిర్దేశించుకుందని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ప్రపంచ దృష్టి ఇరాన్ యుద్ధంపై ఉన్న తరుణంలో, తైవాన్ జలసంధిలో తన శక్తిని ప్రదర్శించడానికి చైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఒక పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతోందా?

ఈ 40 రోజుల 'నోటీస్ టు ఎయిర్ మిషన్స్' (NOTAM) హెచ్చరిక, వాయుసేన, నౌకాదళం, క్షిపణి దళం కలిసి దాడి చేయడానికి సాధన చేస్తున్న ఒక సంయుక్త యుద్ధ విన్యాసం అయి ఉండవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు పౌర విమానయానంపై పెద్దగా ప్రభావం పడనప్పటికీ, ఈ సున్నితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని పైలట్లకు కఠినంగా సూచించారు.

ఇప్పుడు మే 6 వరకు ప్రపంచమంతా చైనా కదలికలను గమనిస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే, ఇది కేవలం చైనా బల ప్రదర్శన మాత్రమేనా లేక తైవాన్‌కు రాబోయే పెద్ద ముప్పుకు నాంది పలకడమా? అనేది చెప్పలేని పరిస్థితి. తైవాన్ పై చైనా యుద్ధానికి దిగితే.. అది ప్రపంచంలో మరో పెద్ద అశాంతిని రేకెత్తిస్తుందనేది వాస్తవం.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story