Mine Collapse: గనిలో ఘోర ప్రమాదం.. కార్మికులు సజీవ సమాధి.. 30 మృతదేహాలు వెలికితీత
Mine Collapse: ఒక బంగారు గని హఠాత్తుగా కూలిపోవడంతో కనీసం 30 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం వల్ల అనేక కుటుంబాలు దిక్కులేనివిగా మారాయి.
Mine Collapse
Mine Collapse: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో అత్యంత దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక బంగారు గని హఠాత్తుగా కూలిపోవడంతో కనీసం 30 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లోపల ఇంకా అనేకమంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. నానా-మాంబెరే ప్రిఫెక్చర్లోని అబ్బ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ భయానక ఘటన వెలుగుచూసింది. సంప్రదాయ పద్ధతిలో తవ్వకాలు జరుపుతున్న ఒక బంగారు గనిలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్టి దిబ్బలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు లోపల ఉన్నారు. ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన ఫ్లోరియన్ గుయేండే అనే కార్మికుడు తెలిపిన వివరాల ప్రకారం.. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని ప్రాణాలతో కాపాడే అవకాశాలు చాలా క్షీణించిపోతున్నాయి.
రెస్క్యూ చర్యల్లో స్థానికుల ఆర్తనాదాలు
ఘటనా స్థలం వద్ద పరిస్థితి ఎంతో హృదయవిదారకంగా మారింది. బురదలో కూరుకుపోయిన యువకులు, మహిళలు తమ తోటి కార్మికులను కాపాడుకోవడానికి చేతులతోనే మట్టిని తొలగిస్తూ శ్రమిస్తున్నారు. డెప్యూటీ మేయర్ సులేమాన్ బయో అందించిన సమాచారం ప్రకారం.. గంటల తరబడి శ్రమించి ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన పలువురు కార్మికులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వేతర సంస్థలు, దాతలు తక్షణమే సహాయం అందించాలని స్థానిక యంత్రాంగం అభ్యర్థిస్తోంది.
ప్రభుత్వ స్పందన.. పెరుగుతున్న భయాందోళనలు
ఈ ఘోర ప్రమాదంపై ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎవరిస్టే ఎన్గమానా స్పందించారు. బాధితుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలిపిన ఆయన, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం శ్రమిస్తోందని వెల్లడించారు. గని లోపల ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ బృందాలు గని లోపలికి వెళ్లేందుకు మార్గాలను సుగమం చేస్తున్నాయి.
భద్రత లేని తవ్వకాలే కొంపముంచాయా?
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో సాంప్రదాయ పద్ధతిలో జరిగే చిన్నతరహా గనుల తవ్వకాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. వేలాది మంది పేద ప్రజలు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మైనింగ్ పనులు చేస్తుంటారు. సరైన ఆధునిక యంత్రాలు, సేఫ్టీ గేర్లు లేకపోవడం వల్ల చిన్నపాటి మట్టిపెళ్లలు విరిగిపడినా అది ప్రాణాంతకంగా మారుతోంది. నిబంధనలు పాటించకుండా తవ్వకాలు జరపడమే ఈ భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.




