US Actions on Iran: అర్ధంగాని అమెరికా చర్యలతో విసిగెత్తిపోతున్న గల్ఫ్ దేశాలు
మద్యప్రాచ్యంలో శాంతి పవనాలు ఇప్పుడిప్పుడే వీస్తున్నాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ దాడులు జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు చేస్తూనే మరోవైపు ముందస్తు దాడులు చేస్తున్న అమెరికా వ్యూహం ఏంటో తెలియక గల్ప్ దేశాలు వణికిపోతున్నాయి.
US Actions on Iran: మద్యప్రాచ్యంలో శాంతి పవనాలు ఇప్పుడిప్పుడే వీస్తున్నాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ దాడులు జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు చేస్తూనే మరోవైపు ముందస్తు దాడులు చేస్తున్న అమెరికా వ్యూహం ఏంటో తెలియక గల్ప్ దేశాలు వణికిపోతున్నాయి. ఇరాన్తో ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా సైన్యం హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ రేవు నగరం బందర్ అబ్బాస్పై ఒక్కసారిగా దాడులకు తెగబడింది. అమెరికా తీసుకుంటున్న ఈ అనాలోచిత నిర్ణయాలు, పొంతన లేని చర్యల వల్ల గల్ఫ్ దేశాలు తీవ్ర అసహనానికి గురవుతున్నాయి. అగ్రరాజ్యం ఆడే ఈ మైండ్ గేమ్లో తాము బలిపశువులవుతున్నామని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
శాంతి ఒప్పందం వేళ అనూహ్య దాడులు
ఇరాన్ తన అధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని రాబోయే 60 రోజుల్లోగా అంతర్జాతీయ రవాణా కోసం తెరిచేందుకు సిద్ధమైంది. ఇరుపక్షాల మధ్య వాతావరణం సద్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలో, అమెరికా సెంట్రల్ కమాండ్ గడిచిన 24 గంటల్లో ఇరాన్ మిస్సైల్ కేంద్రాలు, నౌకలపై దాడులు నిర్వహించింది. తమ సైనికులపై ఎలాంటి దాడి జరగనప్పటికీ, భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందనే నెపంతో "ముందస్తు రక్షణ చర్యగా" ఈ దాడులు చేసినట్లు అమెరికా సమర్థించుకుంటోంది. ఈ దాడుల్లో అమెరికా సైనికులు ఎవరూ మరణించకపోవడంతో, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కాదని, అందువల్ల శాంతి చర్చలకు ఎలాంటి ఢోకా లేదని అమెరికా దౌత్యవేత్తలు చెబుతున్నారు.
గల్ఫ్ దేశాల అసహనానికి కారణం ఏమిటి?
అమెరికా చేస్తున్న ఈ గందరగోళ రాజకీయాలు గల్ఫ్ దేశాలకు అస్సలు అర్థం కావడం లేదు. ఒకవైపు ఇరాన్తో కుదుర్చుకునే ఒప్పందంలో భాగస్వాములు కావాలంటూ అమెరికా తమపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. తీరా చూస్తే, తానే స్వయంగా ఇరాన్పై మిలిటరీ దాడులకు దిగుతోంది. అమెరికా చేసే ఈ దాడులకు ప్రతిగా.. ఇరాన్ నేరుగా అమెరికాతో తలపడకుండా, పక్కనే ఉన్న గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలు, నౌకలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ వ్యూహాత్మక ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలు తమ విలువైన సంపదను, వ్యాపార ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తోంది. అమెరికా దాడులు చేసి వెళ్ళిపోతుంది, కానీ ఆ ప్రాంతంలో నివసించే గల్ఫ్ దేశాలే శాంతి భద్రతల సమస్యను, ఆర్థిక నష్టాలను అనుభవిస్తున్నాయి.
మాజీ అమెరికా దౌత్యవేత్త ఆడమ్ క్లెమెంట్స్ విశ్లేషణ ప్రకారం, అమెరికా దళాలు కేవలం ఇరాన్ సముద్ర ఆస్తుల గురించిన సమాచారాన్ని సేకరించేందుకే ఈ దాడులు చేసి ఉండవచ్చు. అయితే, వ్యూహాత్మక శాంతి చర్చలు నడుస్తున్నప్పుడు ఇలాంటి సైనిక చర్యలు అవసరమా అన్నదే ఇక్కడి ప్రశ్న. అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేకపోవడంతో గల్ఫ్ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడమా లేదా తమ ఉనికిని చాటుకోవడమా.. అమెరికా అసలు ఉద్దేశం ఏంటో తెలియక గల్ఫ్ దేశాలు విసిగిపోతున్నాయి. ఇరాన్ సముద్ర ఆస్తుల గురించిన సమాచారం సేకరించడానికి ఇలాంటి దాడులు చేయవలసిన అవసమేంటి. నష్టం కలిగించి ఆస్తులు అంచనా వేయడం వలన ఉపయోగం ఏముంటుంది. శాంతికి విఘాతం కలిగించడం తప్ప మరోలాభం ఉండదు. అమెరికా యుద్ధవాహక నౌకలు, యుద్ధనౌకలు ప్రయాణిస్తున్న తీరంలో ఇరాన్ క్షిపణీ తయారీ కేంద్రాలు ఉండడాన్ని ముప్పుగా భావించి దాడులు చేసినట్టు అమెరికా చెబుతోంది. ఇరాన్ పోర్ట్లోని నావెల్ బేస్కూడా ధ్వంసం చేసినట్టు పేర్కొన్నది. అయితే, అమెరికా దాడులపై ఇరాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. దోహాలో శాంతి చర్చలు జరుగుతున్నవేళ దీనిపై మాట్లాడకపోవడమే మంచిదని ఇరాన్ అనుకొని ఉండొచ్చు. ఏదిఏమైనా ఎలాంటి తలనొప్పులు లేకుండా శాంతి చర్చలు ముగిసి మద్యప్రాచ్యంలో యుద్ధభయడం వీడాలని కోరుకుందాం.




