Hormuz Strait Tensions: హోర్ముజ్‌ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్‌...చైనా వార్నింగ్‌తో ముదిరిన వివాదం

Hormuz Strait Tensions: మధ్యప్రాచ్యంలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధి వద్ద పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Balachander
Published on: 14 April 2026 12:28 PM IST
Hormuz Strait Tensions
X

Hormuz Strait Tensions  

Hormuz Strait Tensions: మధ్యప్రాచ్యంలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధి వద్ద పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తాజాగా చైనా కూడా స్పందించడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. అమెరికా జలసంధిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

చైనా ఆగ్రహానికి కారణమేంటి?

చైనా తన ఇంధన అవసరాల కోసం ఇరాన్‌పై భారీగా ఆధారపడి ఉంది. అమెరికా యుద్ధ నౌకలను మోహరించి నౌకల రాకపోకలను అడ్డుకోవడం వల్ల చైనా ఆర్థిక ప్రయోజనాలకు గండి పడుతోంది. ఇరాన్‌తో చైనాకు 25 ఏళ్ల కాలపరిమితి కలిగిన భారీ ఇంధన, మౌలిక సదుపాయాల ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలు వాణిజ్య ఒప్పందాల్లోకి వస్తాయి. వీటిని అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరం అవుతుంది. అంతేకాదు, సరఫరాలను అడ్డుకుంటే చైనాకు అందాల్సిన చమురు సరఫరాలో ఇప్పటికే 20 నుంచి 30 శాతం వరకు లోటు ఏర్పడింది. దీంతో చైనా నేరుగా అమెరికాపై విమర్శలు చేయవలసి వచ్చింది. తమ సార్వభౌమత్వాన్ని, వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

యుద్ధం ముదిరితే నష్టపోయేది ఎవరు?

ప్రస్తుతం గల్ఫ్‌ ప్రాంతంలో వందల సంఖ్యలో చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లు సమాచారం. అమెరికా నేవీ పర్యవేక్షణలో నౌకల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనివల్ల చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితి కొనసాగితే భారత్‌, చైనా, యూరప్‌ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెద్ద దెబ్బ తగలవచ్చు. ముఖ్యంగా ఇంధన ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ప్రస్తుతం బ్యారెల్‌ ధర అంచనా ప్రకారం 150 డాలర్ల వైపు పరుగులు తీస్తున్నది. 20 శాతం చమురు ఈ జలసంధి గుండానే రవాణా జరుగుతుంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. చైనా మాదిరిగానే భారత్‌ కూడా ఇక్కడే చిక్కుకుపోయింది. భారత్‌కు చెందిన 15 నౌకలు ఆగిపోవడంతో పెట్రోల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమంటే... ఇప్పటి వరకు ఈ గొడవ అమెరికా ఇరాన్‌ మధ్యనే ఉన్నది. కానీ, ఇప్పుడు చైనా నేరుగా వార్నింగ్‌ ఇవ్వడంతో యుద్ధం దిశ మారుతున్నట్టుగా కనిపిస్తున్నది. చైనా వార్నింగ్‌పై అమెరికా బదులు ఇస్తే మాటల యుద్ధం క్రమంగా మరో యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story