Horrific Bus Crash : రెండు బస్సులు ఢీకొని 35 మంది మృతి.. 30 మంది పరిస్థితి విషమం
Horrific Bus Crash : డమాస్కస్-డెయిర్ ఎజ్జోర్ రహదారిపై రెండు బస్సులు ముఖాముఖి ఢీకొన్న ఘటనలో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోగా, మరొక 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Horrific Bus Crash
Horrific Bus Crash : సిరియాలోని మధ్య-తూర్పు ఎడారి ప్రాంతంలో శనివారం ఒక భయానకమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రయాణికుల బస్సులు అత్యంత వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో కనీసం 35 మంది దుర్మరణం చెందారు. అధికారిక వార్తా సంస్థ సనా (SANA) కథనం ప్రకారం.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించిన వివరాల ఆధారంగా "డమాస్కస్-డెయిర్ ఎజ్జోర్" మార్గంలో ఈ ఘోర ఘాతకం జరిగింది. ఈ ఘటనలో మరో 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
అంతర్గత భద్రతా దళాలు, సివిలియన్ బస్సు ఢీ
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక వివరాలు అందించింది. 'అంతర్గత భద్రతా దళాల సిబ్బందిని' తీసుకెళ్తున్న ఒక బస్సు, ప్రయాణికులతో వెళ్తున్న మరొక సివిల్ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే బాధితుల్లో ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు, ఎంతమంది సాధారణ పౌరులు ఉన్నారనే విషయంపై మంత్రిత్వ శాఖ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.
రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి మిలిటరీ హెలికాప్టర్లు
ప్రమాద తీవ్రతకు సంబంధించిన భయానక దృశ్యాలను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. రోడ్డుపై ఒక బస్సు పూర్తిగా తగలేబడిపోవడం, రహదారి పొడవునా శరీర భాగాలు మరియు వాహన భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు ప్రయాణికుల భయాందోళనను తెలియజేస్తున్నాయి. ప్రమాద స్థలం నుంచి గాయపడిన వారిని, మృతదేహాలను త్వరితగతిన ఆసుపత్రులకు తరలించడానికి ఆర్మీకి చెందిన మిలిటరీ హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
ఇది దేశానికే తీవ్ర విషాదం: అత్యవసర సేవల శాఖ మంత్రి
అత్యవసర మరియు విపత్తు నిర్వహణ మంత్రి రాయెద్ అల్ సాలెహ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో సిరియాలో నమోదైన అత్యంత భయంకరమైన, దారుణమైన రోడ్డు ప్రమాదాలలో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. "ఇలాంటి వేదనాయుత సంఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకోవాల్సిన జాతీయ బాధ్యత మనందరిపై ఉంది" అని వ్యాఖ్యానించారు. సంవత్సరాల తరబడి నిర్లక్ష్యానికి గురై, దెబ్బతిన్న రోడ్డు మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం స్పష్టం చేస్తోందని గుర్తుచేశారు.
శిథిలావస్థకు చేరిన రహదారులు.. వరుస ప్రమాదాలు
సిరియాలో సుదీర్ఘకాలం పాటు సాగిన అంతర్యుద్ధం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అక్కడి రహదారులు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదిహేనేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడంతో ఎక్కువ రోడ్లు గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. డమాస్కస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ మోయాజ్ నజ్జార్ మాట్లాడుతూ.. తూర్పు ప్రాంతంలోని రోడ్డు మరమ్మతులను ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల ప్రారంభంలోనే దారా ప్రావిన్స్లో యాత్రికుల బస్సు బోల్తా పడి ఐదుగురు చనిపోగా, గతంలో కూడా ఆయిల్ ట్యాంకర్లు, బస్సులు ఢీకొని అనేకమంది చనిపోయిన సంఘటనలు జరిగాయి.




