Q Manivannan : బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. శాశ్వత వీసా లేకుండానే ఎంఎస్పీగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి.!
Q Manivannan : స్కాట్లాండ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వింతైన , అత్యంత వివాదాస్పదమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. భారత సంతతికి చెందిన క్యూ మణివణ్ణన్ ..
Q Manivannan
Q Manivannan : స్కాట్లాండ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వింతైన , అత్యంత వివాదాస్పదమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. భారత సంతతికి చెందిన క్యూ మణివణ్ణన్ అనే తమిళ వలసదారుడు, బ్రిటన్లో నివసించడానికి శాశ్వత వీసా (Permanent Visa) లేకపోయినప్పటికీ స్కాటిష్ పార్లమెంటుకు (Holyrood) ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. నాన్-బైనరీగా తన్ను తాను గుర్తించుకునే మణివణ్ణన్, స్వాతంత్ర్య కాంక్ష గల 'స్కాటిష్ గ్రీన్స్' పార్టీ తరపున ఎడిన్బరో & లోథియన్స్ ఈస్ట్ లిస్ట్ నుండి ఎంఎస్పీగా (Member of the Scottish Parliament) గెలుపొందారు. అయితే ఈ ఎన్నిక కేవలం ఒక విజయంలా కాకుండా, బ్రిటన్ వలస విధానాలు , ఎన్నికల నిబంధనలపై పెద్ద ఎత్తున నిరసనలకు , చర్చలకు దారితీసింది.
నిబంధనల మార్పుతో దక్కిన అవకాశం
మణివణ్ణన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం స్కాట్లాండ్ ప్రభుత్వం ఇటీవల మార్చిన ఎన్నికల నిబంధనలే. గతంలో బ్రిటన్లో శాశ్వత నివాస హోదా (Indefinite Leave to Remain) ఉన్న విదేశీయులు మాత్రమే హోలీరూడ్ ఎన్నికల్లో నిలబడటానికి అర్హులుగా ఉండేవారు. కానీ 2025లో ఎస్ఎన్పీ (SNP) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం, స్వల్పకాలిక స్టడీ వీసా వంటి ఏ రకమైన అనుమతి ఉన్నవారైనా అభ్యర్థులుగా పోటీ చేసే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల 2021లో సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేయడానికి స్టూడెంట్ వీసాపై వచ్చిన మణివణ్ణన్, అతి తక్కువ కాలంలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగే అవకాశం లభించింది.
నిధుల సేకరణ , జీతభత్యాల వివాదం
మరో ఆసక్తికరమైన , వివాదాస్పదమైన విషయం ఏమిటంటే, ఎన్నికైన తర్వాత మణివణ్ణన్ తన వీసా ఖర్చుల కోసం సహచరుల నుండి నిధులు కోరారు. తన గ్రాడ్యుయేట్ వీసాను పొడిగించుకోవడానికి అవసరమైన £2,089 (సుమారు 2.2 లక్షల రూపాయలు) నిధుల కోసం ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వీసా లభిస్తేనే ఆయన మరో మూడేళ్ల పాటు బ్రిటన్లో ఉండి, ప్రజల పన్నుల ద్వారా వచ్చే £77,711 (సుమారు 82 లక్షల రూపాయలు) వార్షిక జీతాన్ని ఎంఎస్పీగా అందుకోగలుగుతారు. ఒకవైపు బ్రిటిష్ పౌరసత్వం లేని వ్యక్తి దేశాన్ని ముక్కలు చేయాలనే నినాదంతో ఉన్న పార్టీలో చేరి, మళ్ళీ అదే దేశంలో ఉండటానికి నిధులు అడగటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు
మణివణ్ణన్ ఎన్నికపై బ్రిటన్ లోని స్థానికులు , పలు సంస్థలు మండిపడుతున్నాయి. 'మైగ్రేషన్ వాచ్' అనే గ్రూప్ దీనిపై స్పందిస్తూ, కేవలం స్టూడెంట్ వీసాపై వచ్చి దేశాన్ని విడగొట్టాలని చూసే వారికి ఇక్కడ రాజకీయాల్లో చోటు కల్పించడం విడ్డూరమని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో "రీప్లేస్మెంట్ థియరీ" (Replacement Theory) పేరుతో చర్చలు నడుస్తున్నాయి, అంటే వలసదారుల సంఖ్యను పెంచి స్థానిక స్కాటిష్ ప్రజల ఓటు బ్యాంకును దెబ్బతీస్తున్నారని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం బ్రిటన్ లోనే ఇలాంటి వింతైన చట్టాలు ఉన్నాయని, ఇది పిచ్చితనానికి పరాకాష్ట అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలోని వివాదాస్పద వ్యాఖ్యలు
మణివణ్ణన్ రాజకీయ జీవితమే కాకుండా ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. గతంలో ఆయన యూదుల మారణహోమం జరిగిన 'ఆష్విట్జ్' (Auschwitz) మెమోరియల్ పేజీని అన్-ఫాలో చేసినట్లు గొప్పగా చెప్పుకోవడం, ఇజ్రాయెల్ బందీల పోస్టర్లను ధ్వంసం చేయడాన్ని సమర్థించడం వంటివి తీవ్ర వివాదాలకు దారితీశాయి. అంతేకాకుండా, తెల్లజాతి ప్రజలను ఉద్దేశించి "Goddamn White people" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారంతో కూడుకున్నవని విమర్శకులు ఆరోపిస్తున్నారు. సామాజిక న్యాయం , పర్యావరణ న్యాయం గురించి మాట్లాడే మణివణ్ణన్, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ వలసదారుడి ఎన్నిక స్కాట్లాండ్ రాజకీయాల్లో ఒక కొత్త తరహా సంక్షోభాన్ని , చర్చను రేకెత్తించింది.




