Earthquake: 235 సార్లు కంపించిన భూమి.. 47కు చేరిన మృతుల సంఖ్య.. వందలాది ఇళ్లు నేలమట్టం

Earthquake: ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూమి కంపించడంతో వందలాది భవనాలు నిమిషాల్లో కుప్పకూలిపోయాయి.

CR Reddy
Published on: 16 Aug 2026 7:51 AM IST
Indonesia Earthquake
X

Indonesia Earthquake

Earthquake: ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో శనివారం ఉదయం 5:58 గంటలకు సంభవించిన భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రధాన ప్రకంపన తర్వాత కూడా మరో 235 సార్లు భూమి కంపించింది. ఇందులో అత్యధికంగా 6.2 తీవ్రత నమోదు కావడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేసింది. ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

శిథిలాల కింద మృతదేహాలు

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ చీఫ్ సుహార్యాంతో తెలిపిన వివరాల ప్రకారం రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 47 మృతదేహాలను బయటకు తీశాయి. ఎక్కువగా సిక్కా, మంగరాయ్, తూర్పు మంగరాయ్ ప్రాంతాల్లోనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. దాదాపు 50 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 157 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, మరో 200 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2,000 మందికి పైగా నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడి పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.

రోడ్డుపైకి ఆసుపత్రి బెడ్లు

భూకంప తీవ్రతకు మోమేరే పోర్ట్ టెర్మినల్ వెయిటింగ్ హాల్‌తో పాటు పలు కీలక నిర్మాణాలు నేలకూలాయి. ప్రార్థనలో ఉన్న విద్యార్థులు, నన్స్ భవనం కప్పు కూలడంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ప్రాణభయంతో భవనం రెండో అంతస్తు నుంచి దూకిన ఒక పాస్టర్ కాలు విరిగింది. ఆసుపత్రుల లోపల ప్రకంపనలు రావడంతో రోగులను, ఆక్సిజన్ సిలిండర్లు, స్ట్రెచర్లతో సహా వీధుల్లోకి తరలించి అత్యవసర వైద్యం అందించారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.

రింగ్ ఆఫ్ ఫైర్ శాపం.. పాత జ్ఞాపకాల భయం

పసిఫిక్ మహాసముద్రంలో నిరంతరం అగ్నిపర్వతాలు, భూకంపాలతో ముప్పు పొంచి ఉండే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటమే ఈ విపత్తులకు ప్రధాన కారణం. 1992 డిసెంబర్‌లో ఫ్లోరెస్ దీవిలో సంభవించిన ఘోర భూకంపం, సునామీ దాదాపు 2,500 మంది ప్రాణాలను బలిగొంది. ఆ ఘోర కలికాలాన్ని తలపించేలా ఇప్పుడు మళ్లీ ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

సునామీ హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నప్పటికీ, నిరంతరం వస్తున్న తదుపరి ప్రకంపనలు బాధితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. శిథిలాలను తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఈ విపత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story