PoK Protests: పీవోకేలో ఉద్రిక్తతలు తీవ్రం.. నిరసనకారులపై కాల్పులు, ఆరుగురు మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, ఇంటర్నెట్ బ్లాకౌట్, అణచివేతపై భారత్ తీవ్రంగా స్పందించింది.
PoK Protests
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులపై పాకిస్థాన్ పోలీసులు, రేంజర్లు కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటర్నెట్ సేవలు నిలిపివేతపై ఆగ్రహం
కొంతకాలంగా పీవోకేలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఆర్థిక, సామాజిక ఇబ్బందులు మరింత పెరిగాయని వారు చెబుతున్నారు.
భారత్కు విజ్ఞప్తి
పీవోకే ప్రజలు తమకు మానవతా సాయం అందేలా జోక్యం చేసుకోవాలని భారత్ను కోరారు. ఆహారం, మందులు వంటి నిత్యావసర వస్తువుల సరఫరా కోసం పూంఛ్, దోడా సెక్టార్ల వద్ద నియంత్రణ రేఖ (LoC) ను తెరవాలని విజ్ఞప్తి చేశారు.
పాకిస్థాన్పై భారత్ విమర్శలు
పీవోకేలో కొనసాగుతున్న పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వ్యవస్థాగత దోపిడీ, బలవంతపు ఆక్రమణలు, పరిపాలనా అణచివేతలే తాజా ఘర్షణలకు కారణమని పేర్కొన్నారు.
ఆహారం, మందుల సరఫరా నిలిపివేయడం, ఇంటర్నెట్ సేవలను బ్లాక్ చేయడం, ప్రజలపై అణచివేత చర్యలు కొనసాగించడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
వైట్ హౌస్ ముందు నిరసనలు
పీవోకేలో ప్రజలపై జరుగుతున్న అణచివేతను వ్యతిరేకిస్తూ అమెరికాలో నివసిస్తున్న పీవోకే వాసులు వైట్ హౌస్ ఎదుట కూడా నిరసనలు చేపట్టారు. పీవోకే ప్రజలకు న్యాయం చేయాలని వారు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.




