Desert: ఎడారిలో ఘోరం:..లారీ పాడై.. దాహంతో 49 మంది వలసదారులు మృతి!

Desert: సహారా ఎడారిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాలిలో మతపరమైన వేడుక ముగించుకుని వస్తుండగా లారీ పాడైపోవడంతో ఎండ తీవ్రతకు, దాహానికి తట్టుకోలేక 49 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.

Arun Chilukuri
Published on: 6 Jun 2026 11:05 AM IST
Desert
X

Desert: ఎడారిలో ఘోరం:..లారీ పాడై.. దాహంతో 49 మంది వలసదారులు మృతి!

Desert: సహారా ఎడారి రక్కసిలా మారింది. ఆఫ్రికా దేశాల వలసదారుల జీవితాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో చోటుచేసుకున్న ఒక దారుణ ఉదంతం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిలువెల్లా దహించివేసే ఎండ తీవ్రతకు, చుక్క నీరు దొరకని భయంకర దాహానికి తట్టుకోలేక ఒకే గ్రూపునకు చెందిన 49 మంది వలసదారులు ఎడారిలోనే ప్రాణాలు విడిచారు.

నైజర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరంతా మాలి దేశంలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. నైజర్‌-అల్జీరియా సరిహద్దులోని అసమాకా ప్రాంతానికి చేరుకోగానే, వారు ప్రయాణిస్తున్న లారీ మార్గమధ్యలో హఠాత్తుగా పాడైపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వాహనం స్టార్ట్ కాలేదు సరికదా, ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఎలాంటి జనసంచారం లేకపోవడం, సహాయం అందే మార్గం మూసుకుపోవడంతో ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

సహారా ఎడారిలోని భరించలేని ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు తోడు తాగడానికి నీరు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమికి శరీరం సహకరించక, దాహం తట్టుకోలేక వలసదారుల్లో ఒక్కొక్కరుగా శ్వాస విడిచారు. అలా మొత్తం 49 మంది పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు ప్రయాణించే ఈ రహస్య మార్గాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి చాటిచెప్పిందని నైజర్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘోర నరకం నుంచి ఇద్దరు ప్రయాణికులు మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. సహచరులు కళ్ల ముందే చనిపోతున్నా గుండె నిబ్బరం చేసుకని.. దాహాన్ని, ఎండను భరిస్తూనే వారు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా ఎడారిలో కాలినడకన ప్రయాణించారు. ఎట్టకేలకు ఒక నీటి వనరును (ఒయాసిస్) చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత అక్కడి అధికారులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న నైజర్‌ సైన్యం.. మరణించిన 49 మంది మృతదేహాలను ఎడారిలోనే ఒక సాకూహిక సమాధి (Mass Grave) తవ్వి పూడ్చిపెట్టినట్లు ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story