వియత్నాం ఘోర బోటు ప్రమాదం: తెలుగు రాష్ట్రాల టూరిస్టుల దుర్మరణం
Tragedy in Vietnam: వియత్నాంలోని ఫు క్యూక్ ద్వీపం సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడి జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
వియత్నాం ఘోర బోటు ప్రమాదం: తెలుగు రాష్ట్రాల టూరిస్టుల దుర్మరణం
Tragedy in Vietnam: వియత్నాంలోని ఫు క్యూక్ ద్వీపం సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడి జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సెలవులను ఆస్వాదించడానికి విదేశీ యాత్రకు వెళ్లిన టూరిస్టులు సముద్ర అలల ఉధృతికి బలవ్వడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
వియత్నాంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫు క్యూక్ దీవి సమీపంలో శనివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. ఒక మొబైల్ సంస్థ తమ డీలర్లను వ్యాపార నిమిత్తం వియత్నాంకు తీసుకెళ్లింది. సుమారు 32 మంది భారతీయ పర్యాటకులు , నలుగురు సిబ్బందితో బయలుదేరిన స్పీడ్ బోటు, హాన్ మే రుట్ న్గోయి దీవి నుంచి అన్ థోయ్ రేవుకు వెళ్తుండగా తీరానికి 400 మీటర్ల దూరంలో అదుపు తప్పి బోల్తా పడింది. వాతావరణం అనుకూలించకపోవడం, సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
సహాయక చర్యలు … బాధితుల వివరాలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. బోటులో ఉన్న మొత్తం 36 మందిలో 21 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. దురదృష్టవశాత్తు, 15 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బృందంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
భారత ఎంబసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్స్
ఈ దుర్ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులకు తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టింది. హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలోనూ, హనోయిలోని భారత ఎంబసీలోనూ ప్రత్యేక అత్యవసర కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు సహాయం కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
హో చి మిన్ సిటీ కాన్సులేట్: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414
హనోయి ఎంబసీ: +84 91 308 9165
మృతుల వివరాలు, వారి స్వస్థలాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విదేశాల్లో ఇలాంటి ప్రమాదం జరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




