Tariff: ఫార్మసీ ఇండస్ట్రీకి బిగ్ షాక్... జనరిక్ మందులపై 200శాతం టారిఫ్
ప్రపంచ ఔషధ రంగాన్ని కుదిపేలా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. జనరిక్ మందులపై 200 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. స్వదేశంలో కంపెనీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Tariff: ప్రపంచ ఔషధ రంగాన్ని కుదిపేసేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్ మందులపై ఏకంగా 200 శాతానికి పైగా సుంకాలను విధిస్తూ ఒక సంచలనాత్మక టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదన ప్రకారం, ఆగస్టు 1, 2026 నుంచి తొలి రెండేళ్ల పాటు జనరిక్ మందులపై ఎలాంటి పన్ను ఉండదు. కానీ మూడో ఏట పన్నును 100 శాతానికి, ఆ తర్వాతి ఏట ఏకంగా 200 శాతానికి పెంచనున్నారు. ఔషధ కంపెనీలు తమ తయారీ యూనిట్లను అమెరికాలోనే స్థాపించేలా ఒత్తిడి తెచ్చేందుకే ఈ విధమైన కఠిన నిబంధనలు విధించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా వ్యూహం ... స్వదేశీ తయారీకి పిలుపు
అమెరికా ప్రజల రక్షణ, స్వదేశీ పరిశ్రమలను పెంచాలనే లక్ష్యంతోనే ఈ 'రిషోరింగ్' విధానాన్ని తీసుకొచ్చినట్లు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఈ కొత్త టారిఫ్ల ప్రకారం తొలి 2 సంవత్సరాలు సున్నా శాతంగా ఉండనుండగా...మూడో ఏడాది 100%, ఆ తరువాత నాలుగో ఏడాది నుండి 200% టారిఫ్ అమలులోకి వస్తుంది. అయితే, ట్రంప్ విధించిన ఈ టారిఫ్ విధానం వలన భారత్ ఫార్మా రంగానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. భారత్ను ప్రపంచానికి ఫార్మా రాజధానిగా చెబుతారు. అమెరికా వినియోగించే జనరిక్ మందుల్లో 40 శాతం మందులు భారత్ నుంచే ఎగుమతి అవుతాయి. మొదటి రెండేళ్లు సున్నా టారిఫ్ ఉన్నా మూడో ఏడాది నుంచి భారం పెరుగుతుంది. ఎగుమతులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇప్పుడు భారత్ తమ మందులను వేరే దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
అమెరికా ఆరోగ్య రంగానికి ఇండియా ఊరట
అమెరికా వెలుపల యూఎస్ ఎఫ్డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే. భారత దేశంలో సుమారు 3 వేల ప్లాంట్లు యూఎస్ ఎఫ్డీఏ ఆమోదం పొందినవే ఉన్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆమోదం పొందిన ప్లాంట్లలో ఇది 25 శాతం. ఈ ప్లాంట్లలో తయారైన మందులను యూఎస్ కొనుగోలు చేస్తుంది. టారిఫ్ అమలులోకి వస్తే సుంకాల భారం పెరుగుతుంది. ఫలితంగా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే, 2013 నుండి 2022 మధ్యకాలంలో భారతీయ జనరిక్ మందుల కారణంగా అమెరికాకు సుమారు 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అయినట్టు నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన మందుల స్థానంలో ఈ జనరిక్ మందులను వినియోగిస్తారు. ట్రంప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం కారణంగా రాబోయే రెండేళ్లలో భారతీయ దిగ్గజ ఫార్మా కంపెనీలు తమ ప్లాంట్లను అమెరికాలో ఏర్పాటు చేయవలసిన పరిస్థితి రావొచ్చు. లేదా సుంకాలను భారాన్ని భరించాల్సి రావొచ్చు.




