Karimnagar: నిబద్ధత గల కలం ఆగింది.. జర్నలిస్ట్ సంభోజి శేఖర్ ఆకస్మిక మృతి
Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సంభోజి శేఖర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.
Karimnagar: నిబద్ధత గల కలం ఆగింది.. జర్నలిస్ట్ సంభోజి శేఖర్ ఆకస్మిక మృతి
కరీంనగర్ జిల్లా: చొప్పదండి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సంభోజి శేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈరోజు ఉదయం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
పాత్రికేయ రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. అనేక సంవత్సరాల పాటు నిష్పాక్షికంగా, నిబద్ధతతో వార్తలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. చొప్పదండి ప్రాంతంలో జరిగిన పలు సామాజిక, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజల హక్కుల కోసం కృషి చేశారు.
సంభోజి శేఖర్ మృతితో పాత్రికేయ రంగం ఒక నిబద్ధత కలిగిన జర్నలిస్టును కోల్పోయింది. ఆయన మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్థానిక ప్రజలు, సహచరులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. సంభోజి శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.




