Rayachoty: జాతీయ అడ్వెంచర్ శిబిరంలో అన్నమయ్య స్కౌట్స్ హవా
Rayachoty: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జరిగిన జాతీయ అడ్వెంచర్ శిబిరంలో అన్నమయ్య జిల్లాకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
Rayachoty: జాతీయ అడ్వెంచర్ శిబిరంలో అన్నమయ్య స్కౌట్స్ హవా
Rayachoty: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా కుర్సియాంగ్ లో ఈ నెల 11 నుంచి 15 వరకు నిర్వహించిన ఐదు రోజుల జాతీయ అడ్వెంచర్ (సాహస కృత్యాల) శిక్షణా కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు.
ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ స్కై సైక్లింగ్, ట్రెక్కింగ్, షూటింగ్, హైకింగ్, ఆర్చరీ వంటి సాహస కృత్యాల్లో అన్నమయ్య జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందుకున్నారని తెలిపారు. సేవా కార్యక్రమాల్లోనే కాకుండా సాహస కృత్యాలలో కూడా అన్నమయ్య జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రకృతి మధ్య నిర్వహించిన ఈ అడ్వెంచర్ శిక్షణా శిబిరం విద్యార్థులకు మరపురాని అనుభూతిని కలిగించిందని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులతో పరస్పర పరిచయాలు ఏర్పడి జాతీయ సమైక్యత భావన మరింత బలపడిందని ఆయన వివరించారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి మరియు క్రమశిక్షణ పెంపొందించేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ప్రతీ ఏటా జాతీయస్థాయిలో ఇలాంటి అడ్వెంచర్ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
ఈ జాతీయ శిక్షణా శిబిరంలో జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డితో పాటు స్కౌట్ మాస్టర్లు ప్రేమ్ సాగర్, మోహన్ బాబు, గురునాథరెడ్డి, నితిన్ రెడ్డి, గైడ్ కెప్టెన్ పద్మజ, 7 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.




