Brahmamgari Matham: బ్రహ్మంగారిమఠంలో ఆరాధనోత్సవాలు ప్రారంభం.. భక్తుల భారీ రద్దీ
Brahmamgari Matham: కడప బ్రహ్మంగారిమఠంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 28 వరకు ఘనంగా నిర్వహించనున్నారు.
Brahmamgari Matham
Brahmamgari Matham: కడప జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఈ నెల 28వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి వెల్లడించారు.
చరిత్ర ప్రకారం క్రీ.శ. 1693లో శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి రోజున వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి నిష్ఠ వహించారు. ఆ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ ఆరాధనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 26న ప్రధాన ఆరాధన కార్యక్రమం నిర్వహించనుండగా, ఏప్రిల్ 27న కనులపండువగా రథోత్సవం జరుగనుంది. ఏప్రిల్ 28న మహాప్రసాద నివేదనతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, మాలధారులు తరలివచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వసతి, తాగునీరు, క్యూలైన్లు వంటి మౌలిక సదుపాయాలను మఠం తరపున పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు మఠాధిపతి తెలిపారు.




