Rayachoti: జీఓ 396తో దస్తావేజులేఖర్ల ఉపాధికి ముప్పు: శ్రీకాంత్ రెడ్డి
Rayachoti: జీఓ 396తో దస్తావేజులేఖర్ల ఉపాధి దెబ్బతింటుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటిలో వారి నిరసనకు వైఎస్సార్సీపీ నేత గడికోట సంఘీభావం తెలిపారు.
Rayachoti: జీఓ 396తో దస్తావేజులేఖర్ల ఉపాధికి ముప్పు: శ్రీకాంత్ రెడ్డి
జీఓ 396తో లక్షలాది కుటుంబాల ఉపాధికి ముప్పు..!
దస్తావేజులేఖర్ల జీవనోపాధిపై కూటమి ప్రభుత్వం కత్తి వేలాడదీసింది: శ్రీకాంత్ రెడ్డి
రాయచోటిలో దస్తావేజులేఖర్లనిరసనకు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి సంఘీభావం
జి ఓ నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.396తో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది దస్తావేజులేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాయచోటిలో దస్తావేజులేఖర్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో చిన్న వృత్తిదారుల ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. దస్తావేజుల తయారీ హక్కులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఏళ్ల తరబడి ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లలో ఆధార్ ఓటీపీ సమస్యలు, సర్వర్లు తరచూ పనిచేయకపోవడం, డేటాబేస్ లోపాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చెల్లించిన చలానా సొమ్ము వృథా కావడంతో ప్రజల ఆగ్రహానికి దస్తావేజులేఖర్లు బలవుతున్నారని తెలిపారు.
చిన్న వృత్తిదారుల జీవనోపాధిని కాపాడాల్సిన ప్రభుత్వమే వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. జీఓ నెం.396ను తక్షణమే రద్దు చేసి, దస్తావేజులేఖర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజల హక్కులు, చిన్న వృత్తిదారుల సంక్షేమ పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్,పట్టణ అధ్యక్షుడు నవాజ్, నాయకులు అన్నా సలీం,ఖళీళ్, యూసుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు




