Porumamilla: పోరుమామిళ్లలో ప్రభుత్వ టీచర్ల ప్రైవేట్ దందా!

Porumamilla: వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని ఏఐఎస్ఏ ఆరోపించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Jun 2026 2:59 PM IST
Porumamilla
X

Porumamilla: పోరుమామిళ్లలో ప్రభుత్వ టీచర్ల ప్రైవేట్ దందా!

Porumamilla: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేయాల్సిన కొందరు ఉపాధ్యాయులు “సంకల్ప కోచింగ్”, “ఐఐటీ అకాడమీ”, “సైనిక్-నవోదయ-ఆర్‌ఎంఎస్ కోచింగ్” పేర్లతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి అనిల్ తీవ్రంగా ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే తల్లిదండ్రుల ఆశలు, విద్యార్థుల భవిష్యత్తును పెట్టుబడిగా మార్చుకుని భారీ మొత్తాల్లో ఫీజులు వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉన్నవారు, అదే విద్యను ప్రైవేట్ కోచింగ్ రూపంలో అమ్ముకోవడం విద్యా వ్యవస్థకు మచ్చ అని విమర్శించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా అందాల్సిన మార్గదర్శకత్వాన్ని డబ్బులు చెల్లించే వారికి మాత్రమే పరిమితం చేయడం సామాజిక అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన ఉపాధ్యాయులే కోచింగ్ సెంటర్లను ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సేవా నియమావళిని ఉల్లంఘిస్తూ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే సంబంధిత ప్రభుత్వ ఉద్యోగుల పేర్లతో సహా జిల్లా విద్యాశాఖాధికారి (DEO)కి ఫిర్యాదు చేస్తామని అనిల్ స్పష్టం చేశారు.

“విద్యార్థుల భవిష్యత్తు బంగారు గని కాదు విద్యను అమ్ముకునే మార్కెట్ కాదు. విద్య సేవగా ఉండాలి. దానిని వ్యాపారంగా మార్చే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని అనిల్ హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story