Rayachoti: ఏపీలో ఈవీ వాహనాలపై 5% రాయితీ మంత్రి మండిపల్లి!
Rayachoti: ఈవీ పాలసీతో ఏపీలో విద్యుత్ వాహనాలకు మరింత ప్రోత్సాహం. 5 శాతం రాయితీ, 5 ఏళ్లు రోడ్ టాక్స్ మినహాయింపు అని తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoti: ఏపీలో ఈవీ వాహనాలపై 5% రాయితీ మంత్రి మండిపల్లి!
Rayachoti: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతతో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
2024–29 సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోలుపై ఎక్స్షోరూమ్ ధరలో 5 శాతం వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకునే విద్యుత్ వాహనాలకు ఐదేళ్లపాటు రోడ్ ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఈవీల వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న ఆదరణ
దేశంలో విద్యుత్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆగస్టులో దేశవ్యాప్తంగా సుమారు 2.98 లక్షల విద్యుత్ వాహనాలు విక్రయించబడటం, గత ఏడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి నమోదవడం ఈ రంగానికి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు. మొత్తం వాహన మార్కెట్లో ఈవీల వాటా 9.5 శాతం నుంచి 12.3 శాతానికి పెరగడం భవిష్యత్ రవాణా వ్యవస్థలో విద్యుత్ వాహనాల ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు.




