Porumamilla: పోరుమామిళ్ల రెవెన్యూ ప్రాంగణంలో ప్రధాన ద్వారం కొనసాగింపు
Porumamilla: పోరుమామిళ్ల రెవెన్యూ ప్రాంగణంలో ప్రధాన ముఖద్వారాన్ని యథాతథంగా ఉంచాలని కారు ప్రవీణ్ బాబు విజ్ఞప్తి. ప్రజల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్.
Porumamilla: పోరుమామిళ్ల రెవెన్యూ ప్రాంగణంలో ప్రధాన ద్వారం కొనసాగింపు
పోరుమామిళ్ల: (నంది పత్రిక) బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలోని రెవెన్యూ ప్రాంగణం ప్రజలకు అత్యంత కీలకమైన ప్రభుత్వ సేవా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంగణంలో చేపట్టే ఏ నిర్మాణమైనా ప్రజల రాకపోకలకు, అత్యవసర సేవలకు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆఫీస్ సెక్రటరీ కారు ప్రవీణ్ బాబు కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీయవచ్చని అన్నారు. ప్రస్తుతం మాత్రమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున, విశాలమైన ప్రధాన ప్రవేశ ద్వారం తప్పనిసరిగా కొనసాగించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, విపత్తు నిర్వహణ బృందాలు, ఇతర ప్రభుత్వ వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా లోపలికి చేరుకునే అవకాశం ఉండాలని, ప్రజల ప్రాణాలు మరియు భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజీ పడకూడదని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు, వివిధ ప్రభుత్వ సేవల కోసం వచ్చే రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించే విధంగా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.
ప్రజా ఆస్తులు ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగించబడాలి తప్ప, ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని ఆయన అన్నారు. వివాదాలకు తావు లేకుండా అధికారులు అన్ని కోణాల్లో పరిశీలించి, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, రెవెన్యూ ప్రాంగణంలోని ప్రధాన ముఖద్వారం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యథాతథంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆఫీస్ సెక్రటరీ కారు ప్రవీణ్ బాబు ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని వారు తెలియజేశారు




