Porumamilla: వైభవంగా శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం
Porumamilla: పోరుమామిళ్లలో శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
Porumamilla: వైభవంగా శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం
పోరుమామిళ్ల: పోరుమామిళ్ల పట్టణంలో భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
దిల్ రాజు పోరుమామిళ్లకు విచ్చేసిన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ మీదుగా పట్టాభి రామచంద్ర స్వామి ఆలయం వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ మొత్తం భక్తి భావంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో ఉత్సాహభరితంగా సాగింది.అనంతరం బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్ రాజును శాలువాతో సత్కరించి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, “పవిత్రమైన పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వామివారి సన్నిధికి వచ్చి ఆశీస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను, శాంతిని ప్రసాదిస్తూ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
పట్టాభి రామచంద్ర స్వామివారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని, స్వామివారి కృపతో పోరుమామిళ్ల ప్రజలందరూ సుఖశాంతులతో, సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంతో పోరుమామిళ్ల పట్టణం రామనామ స్మరణతో,మంగళవాయిద్యాల నాదంతో, భక్తుల హర్షధ్వానాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.




