Rayachoty: స్థల వివాద ఘర్షణను మంత్రికి అంటగట్టడం రాజకీయ కుట్ర
Rayachoty: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై వైసిపి నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలను రాయచోటి టీడీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు.
Rayachoty: స్థల వివాద ఘర్షణను మంత్రికి అంటగట్టడం రాజకీయ కుట్ర
Rayachoty: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, మేనల్లుడు మౌర్య రెడ్డి ల పై అసత్య ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సుజాత, రమ్య, హజీరా హెచ్చరించారు. రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి పట్టణంలోని చిత్తూరు రింగ్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన ఓ స్థల వివాదంలో రిటైర్డ్ డిఈ ఆదినారాయణ రెడ్డి దశధరామిరెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి అంటగట్టడం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామి రెడ్డి సతీమణి విజయమ్మకు తగదన్నారు.
ఆదినారాయణ రెడ్డి, దశరథరామి రెడ్డి ల మధ్య జరిగే స్థల వివాదానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి ఆయన సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, మేనల్లుడు మౌర్య రెడ్డి లకు వారి అనుచరులకు ఏంటి సంబంధం అన్నారు. గత ప్రభుత్వాన్ని, ప్రధాన నేతలను అడ్డుపెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడిన చరిత్ర మీదన్నారు. మండిపల్లి కుటుంబం బిక్షతో రాజకీయంలోకి వచ్చిన మీరు ఆ కుటుంబం పై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. రాయచోటి లో జరిగే ప్రతి ఒక్క ఘటనను మంత్రి కి ఆపాదించడం వైసిపి నేతలకు అలవాటుగా మారిందన్నారు.
ఇకపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి పై అసత్య ఆరోపణ చేస్తే సరైన సమయంలో దీటైన సమాధానం చెప్తామని హెచ్చరించారు. వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ గా ఉండి వీరభద్ర స్వామి కే శఠిగోపం పెట్టిన ఘనత మీదే అని ఆరోపించారు. వీరభద్ర స్వామి కి కర్ణాటక, ప్రాంతాలకు చెందిన భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలు ఆలయంలో ఉన్న ఓ పూజారి సతీమణి బ్యాంక్ ఖాతాలో జమ చేయించి ఆ సొమ్మును స్వాహా చేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. మీరు చేసిన అవినీతి ని త్వరలో ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు.
భార్యాభర్తలిద్దరూ కలిసి చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలకు చెందిన బాధితులే నేడు మీపై దాడులకు తెగబడుతున్నారన్నారు. రాజకీయ లబ్ది పొందాలన్న దురుద్దేశంతో ఈ దాడిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంటగడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు బెదిరింపులకు పాల్పడిన మీరు నేడు వ్యవస్థల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.




