Kakinada: పరిశ్రమల ఖాళీ స్థలాలు హరిత వనాలుగా మారాలి నాగబాబు!

Kakinada: పరిశ్రమలు ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలని ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు పిలుపునిచ్చారు. దివిస్ ల్యాబ్స్‌లో మొక్కలు నాటి, ప్లాంటేషన్‌ను సమీక్షించారు.

MANIKANTA, TUNI
Published on: 9 Sept 2026 8:38 AM IST
Kakinada
X

Kakinada: పరిశ్రమల ఖాళీ స్థలాలు హరిత వనాలుగా మారాలి నాగబాబు!

Kakinada: పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ ‌బెల్ట్‌ను మరింత విస్తరించి, స్థానిక వృక్ష జాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ మరియు ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

మంగళవారం కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివిస్ లేబొరేటరీస్‌ను ఆయన సందర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, ప్లాంటేషన్ కార్యక్రమాలపై వారు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ మరియు ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ “పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్‌ బెల్ట్‌ను మరింత విస్తరించాలి. పెద్దగా పెరిగే స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇచ్చి మొక్కలు నాటాలి. అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలి. పరిశ్రమలలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ దశలవారీగా హరిత వనాలుగా మార్చాలి. నాటిన మొక్కల సంరక్షణ, మనుగడపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి” అని పిలుపునిచ్చారు.

దివీస్ ల్యాబ్స్‌లో గ్రీన్ బెల్ట్ పరిశీలన

అంతకు ముందు శ్రీ నాగబాబు గారు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ దివీస్ పరిశ్రమ ప్రాంగణాన్ని సందర్శించి, ఇప్పటికే అభివృద్ధి చేసిన గ్రీన్ బెల్ట్, మొక్కలు నాటిన ప్రాంతాలను పరిశీలించారు. అలాగే భవిష్యత్‌లో మరింత హరిత ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తుతం చేపడుతున్న ప్లాంటేషన్ కార్యక్రమంతోపాటు, భవిష్యత్‌లో గ్రీన్ బెల్ట్‌ను మరింత విస్తరించేందుకు రూపొందించిన ప్రణాళికలను వారికి వివరించారు.

అనంతరం దివిస్ లేబొరేటరీస్‌కు చెందిన 100 మందికి పైగా ఉద్యోగులతో కలిసి శ్రీ నాగబాబు మరియు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చురుకుగా పాల్గొనడాన్ని వారు అభినందించారు. ఇప్పటి వరకు పరిశ్రమ ప్రాంగణంలో వివిధ జాతులకు చెందిన మొత్తం 25,150 మొక్కలను నాటినట్లు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.

చివరగా దివిస్ లేబొరేటరీస్ ప్రతినిధులు పరిశ్రమ చేపడుతున్న సీఎస్‌ఆర్ (CSR) కార్యక్రమాలపై వివరాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవల కోసం కేటాయిస్తున్న సీఎస్‌ఆర్ నిధులు, వాటి వినియోగం, అలాగే సీఎస్‌ఆర్‌లో భాగంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు మరియు పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI