Konaseema: బడి పిలుస్తోంది కార్యక్రమంపై జేసీ కీలక సూచనలు
కోనసీమ జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి నూరు శాతం నమోదు సాధించాలని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిదియాదేవి సూచించారు.
Konaseema
Konaseema: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో “బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని విజయవంతం చేసి నూరు శాతం విద్యార్థుల నమోదు సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిదియాదేవి పిలుపునిచ్చారు.
అమలాపురంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, చదువు ప్రతి బిడ్డకు ప్రాథమిక హక్కని, పిల్లలను పనులకు పంపడం నేరమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి విద్యావంతులైన యువత అవసరమని, అందుకే ప్రభుత్వం “బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టిందన్నారు.
బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి బాలబాలిక పాఠశాలలో చేరేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి సదుపాయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రతి చిన్నారి వివరాలు సేకరించి, బడి మానేసిన పిల్లలను కౌన్సిలింగ్ ద్వారా తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు.
అనాథలు, వలస కార్మికుల పిల్లలు, వీధి బాలలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి విద్య అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.




