Konaseema: మే 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
Konaseema: కోనసీమ జిల్లాలో మే 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 30 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Konaseema
Konaseema: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఏపీ ఎడ్సెట్ (B.Ed) ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియాదేవి అధికారులను ఆదేశించారు.
అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి జాయింట్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 14,171 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రశ్నపత్రాలను 14 పోలీస్ స్టేషన్లలో భద్రపరుస్తున్నట్లు పేర్కొన్న అధికారులు, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల రాకపోకలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు.
ఇక ఈ నెల 8న జరగనున్న ఏపీ ఎడ్సెట్ పరీక్షలను శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ, చెయ్యేరు మరియు బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ, భట్లపాలెంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.




